నిరసన చేస్తున్న విద్యార్థులను ప్రేరేపించారనీ..

– ‘టిస్‌’ ప్రొఫెసర్‌కు షోకాజ్‌ నోటీసు
– సంస్థ చర్యను తప్పుబట్టిన విద్యావేత్త
న్యూఢిల్లీ : తమ హైదరాబాద్‌ క్యాంపస్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న అర్జున్‌ సేన్‌ గుప్తాకు టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోసల్‌ సైన్సెస్‌(టిస్‌) షోకాజ్‌ నోటీసును జారీ చేసింది. నిరసన చేస్తున్న విద్యార్థులను ప్రేరేపిస్తున్నారన్న ఆరోపణలపై టిస్‌ ఈ చర్యకు దిగింది. ఈనెల 4న విద్యార్థి సంఘాలు ఏర్పాటు చేసిన నిరసన ప్రదర్శనలో సేన్‌గుప్తా మాట్లాడారు. జాతీయ ప్రయోజనాలకు విరుద్ధమై కార్యకలాపాలు చేశారన్న ఆరోపణలపై ఏప్రిల్‌లో సస్పెండ్‌ అయిన పీహెచ్‌డీ స్కాలర్‌, దళిత విద్యార్థి నేత విద్యార్థి రామదాస్‌ ప్రిని శివనాదన్‌కు ఆయన సంఘీభావం ప్రకటించారు. అయితే, దీనికి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూపిస్తూ టిస్‌ యాజమాన్యం సేన్‌గుప్తాకు నోటీసును పంపింది. అయితే, తనకు ఇచ్చిన నోటీసుపై సేన్‌ గుప్తా స్పందించారు. వాస్తవానికిది నిరాధారం, రాజ్యాంగ, చట్టవిరుద్ధమని అన్నారు. ఈ విషయంలో తనను వ్యక్తిగత విచారణకు నిరాకరించారని తెలిపారు. ఈనెల 8న అందిన నోటీసుకు.. 13న సేన్‌గుప్తా తన ప్రతిస్పందనను తెలియజేశారు. ”టిస్‌ హైదరాబాద్‌ క్యాంపస్‌లో ఈనెల 4న అంబేద్కర్‌ స్టూడెంట్స్‌ అసోసియేసన్‌ (ఏఎస్‌ఏ), ది ప్రొగ్రెస్సివ్‌ స్టూడెంట్స్‌ ఆర్గనైజేషన్‌ (పీఎస్‌ఓ)లు నిర్వహించిన విద్యార్థుల సమావేశంలో ఈ వీడియో నా ప్రసంగ భాగం. టిస్‌ క్యాంపస్‌లంతటా ఉన్న మూడు మేజరల్‌ విద్యార్థి సంఘాలు పీఎస్‌ఎఫ్‌, ఏఎస్‌ఏ, పీఎస్‌ఓలను నేను స్పష్టంగా పేర్కొన్నాను. నా ప్రసంగం సమయంలో నేను నినాదాలు చేశాననీ, ఎవరినైనా ప్రేరేపించానని చెప్పటం అవాస్తవం” అని ఆయన వివరించారు.