‘నేను ఊహించని ఎన్నో అద్భుతాలు నా కెరీర్లో జరిగాయి. దర్శకుడిగా 25 ఏండ్ల జర్నీ చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ ప్రయాణం అద్భుతం. ఇలాంటి సంతృప్తికరమైన జర్నీకి కారకులైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’ అని అన్నారు డైరెక్టర్ శ్రీను వైట్ల. ‘నీ కోసం’ చిత్రంతో ఆయన దర్శకుడిగా పరిచయమయ్యారు. రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. 7 నంది అవార్డులను సొంతం చేసుకున్న ఈ చిత్రం 3-12-1999లో విడుదలై, నేటితో (మంగళవారం) 25 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీనువైట్ల మీడియాతో తన జర్నీ గురించి పలు ఆసక్తికరమైన విశేషాలను షేర్ చేసుకున్నారు. ‘నాతొలి సినిమా ఆగిపోవడంతో బాగా డిజప్పాయింట్ అయ్యాను. మళ్ళీ ఓ కథ రాసుకుని, తక్కువ బడ్జెట్లో చేయాలని అనుకున్నాను. అలా ‘నీ కోసం’ సినిమా స్టార్ట్ చేశాం. అప్పుడు కూడా కొన్ని కారణాల వలన సినిమా కొంతకాలం ఆగింది. రవితేజ నా స్నేహితుడు. తన ప్రోత్సాహంతో ఆ సినిమాని ఫినిష్ చేశాను. నాగార్జున ఫస్ట్ కాపీ చూశారు. ఆయనకి బాగా నచ్చి, నాకు డైరెక్షన్ ఆఫర్ చేశారు. అలాగే రామోజీ రావుకి కూడా సినిమా నచ్చి, అవుట్రేట్కి కొనేశారు. ఒక మంచి సినిమా ఆగకూడదనే ఉద్దేశంతో తీసుకున్నానని, వారి బ్యానర్లో నాకు సినిమా ఇస్తానని రిలీజ్కి ముందే ఆయన మాట ఇచ్చారు. ఆ బడ్జెట్కి సినిమా రీజనబుల్గానే ఆడింది. ఏడు నంది అవార్డ్స్ రావడం చాలా ఆనందంగా అనిపించింది. రామోజీ రావు చెప్పినట్లే నాకు వారి బ్యానర్లో ‘ఆనందం’ సినిమా ఇచ్చారు. నాగార్జున డైరెక్షన్ ఆఫర్ చేయడం, రామోజీ రావుకి సినిమా నచ్చడం, రిలీజ్ చేయడం, 7 నంది అవార్డ్స్ రావడం.. ఇవన్నీ మెమరబుల్ మూమెంట్స్. నా జర్నీలో టాప్ 5 మూవీస్ చెప్పమంటే, ‘ఆనందం, వెంకీ, రెడీ, దూకుడు, ఢ’ అని గర్వంగా చెప్పగలను. రీసెంట్గా ‘విశ్వం’ సాధించిన ఘన విజయం మరిన్ని మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు ఉత్సాహాన్నిచ్చింది’.