బీజేపీ లో చేరే వారే అవినీతిపరులు : కేజ్రీవాల్‌

బీజేపీ లో చేరే వారే అవినీతిపరులు : కేజ్రీవాల్‌చంఢఘీర్‌ : అవినీతికి వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వ పోరాటం ఓ ‘జిమ్మిక్కు’ అని ఆప్‌ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ విమర్శించారు. హర్యానాలోని రోహ్ తక్‌లో ఆప్‌ ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అవినీతికి, నేరానికి పాల్పడిన వ్యక్తి బీజేపీ లో చేరగానే.. ఈడీ,సీబీఐ, ఐటి వంటి దర్యాప్తు సంస్థలు అతనిని తాకేందుకు కూడా సాహసించవని విమర్శించారు. ‘అవినీతి పరులంటే ఇడి విచారణతో జైలు పాలైన వారు కాదు. ఈడీ భయంతో బీజేపీ లో చేరిన వారే అవినీతి పరులు. ఇడి దాడులతో జైలు పాలైన వారు, బీజేపీ లో చేరని వారు నిజాయితీపరులు. ఎప్పటికైనా వారు జైలు నుంచి బయటికి వస్తారు” అని అన్నారు. నిజాయితీ లేనివారు జైలుకెళ్తే.. జీవితాంతం జైలులోనే ఉండాల్సివస్తుందని వారికి తెలుసని, అందుకే బీజేపీ లో చేరతారని చెప్పారు. అవినీతిపరులు, నిజాయితీపరుల మధ్య తేడాను ప్రజలు స్పష్టంగా తెలుసుకోవాలని అన్నారు. ఇటీవల ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కేజ్రీవాల్‌కు ఇడి సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.