– కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో ఘటనలు
నవతెలంగాణ – శంకరపట్నం/కామేపల్లి
లారీ, కారు, బొలేరో వాహనం, లారీ ఢకొీన్న ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలు శనివారం కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో జరిగాయి. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో జరిగిన ఘటనకు సంబంధించి ఎస్ఐ పాకాల లక్ష్మారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం పెద్దంపల్లి గ్రామానికి చెందిన బెల్లంకొండ ఆకాష్, అతని స్నేహితులు పైడిపల్లి రాకేష్, మ్యాడగొని శ్రావణ్ హనుమకొండ నుంచి వేములవాడకు కారులో వెళ్తున్నారు. తాడికల్ శివారులో కారును లారీ ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో శ్రావణ్, ఆకాష్ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన రాకేష్ను ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. ఆకాష్ తండ్రి బెల్లంకొండ రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు.
ఆగిన లారీని ఢకొీన్న బొలేరో వాహనం
ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం అడవి మద్దలపల్లి గ్రామ సమీపంలో గంగమ్మ ఆలయం వద్ద ధాన్యం లోడుతో ఆగి ఉన్న లారీని కోళ్ల లోడుతో వెళుతున్న బొలేరో వాహనం వెనుక నుంచి వేగంగా వచ్చి ఢకొీట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ పక్కన కూర్చున్న కురసం వెంకన్న(40) మృతిచెందారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బయ్యారం మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన గోగుల సాయి, కురసం వెంకన్న బొలేరో ట్రాలీలో కోళ్లు వేసుకొని వరంగల్ నుంచి ఏన్కూరు వెళ్తున్నారు.కామేపల్లి మండలం మద్దులపల్లి గ్రామంలోని మెయిన్ రోడ్డు వద్ద గల గంగమ్మ గుడి సమీపంలో ధాన్యం లోడుతో ఉన్న లారీని డ్రైవర్ రోడ్డుపై ఆపాడు. బొలేరో వాహనం లారీని వెనుక నుంచి ఢకొీట్టింది. దాంతో బొలేరోలో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ పక్కన కూర్చున్న కురసం వెంకన్న అక్కడికక్కడే మృతిచెందారు. అతనికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య కురసం కార్తీక ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తులో ఉంది. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది.