– ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయే పథకాల రూపకల్పనకు ఆద్యుడు
– పత్తనంతిట్ట సీపీఐ(ఎం)అభ్యర్థిగా పోటీ
– జె.జగదీష్, నవతెలంగాణ
కేరళలోని పత్తనంతిట్ట లోక్సభ అభ్యర్థి టీఎం థామస్ ఐజాక్కి కొత్త విషయాలు తెలుసుకోవాలనే తపన, ఉత్సుకత ఎప్పుడూ ఉంటుంది. ఏ ప్రజా సమస్యనైనా కార్మిక వర్గ దృక్పథంతోనే చూస్తారు. జ్ఞాన సముపార్జన ఆయన జీవన విధానం. కాబట్టి ఉపాధ్యాయ-విద్యార్థి సంబంధం ఎల్లప్పుడూ ఆయనతోనే ఉంటుంది. అందువల్ల దేశ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో కూడా ఆయన ఆలోచనలు అద్భుతంగా ఉంటాయి. వేలాది మంది గృహిణుల ఆర్థిక స్వావలంబనకు దారితీసిన ప్రాజెక్టులు కుటుంబశ్రీ, జానకీయసూత్రం వంటి వాటితో ప్రపంచ దేశాలు సైతం ఆశ్చర్యపోయేలా చేశారు. కేరళ అభివృద్ధి పథంలో సాధించిన విజయాల వెనుక టీఎం థామస్ ఐజాక్ ఉన్నారు. గొప్ప ఆర్థికవేత్తగా, ఉపన్యాసకునిగా, అనేక గ్రంథాల రచయితగా, గొప్ప నిర్వాహకుడిగా తనదైన ముద్ర వేసుకున్నారు.
కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ బోర్డ్ (కెఐఎఫ్బీఐ)తో రాష్ట్రంలో రూ.80 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల తయారీకి కూడా ఆయన నాయకత్వం వహించారు. ఆయన నిర్వహిస్తున్న ఏకేజీ స్టడీ రీసెర్చ్ సెంటర్ మైగ్రేషన్ కాన్ క్లివ్తో పాటు, పత్తనంతిట్ట జిల్లాలో ఐదు వేల మందికి ఉపాధి కల్పించేందుకు అవసరమైన చర్యలతో ముందుకు సాగుతోంది. 20 ఏండ్లుగా శాసన సభ్యుడిగా కొనసాగుతున్నప్పటికీ తొలిసారిగా పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పదేండ్లపాటు రాష్ట్రంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ప్లానింగ్ కమిటీ మెంబర్గా కూడా పనిచేశారు. ఆయన 2001-06లో మరారికుల్, 2011-16లో అలప్పుజ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. రెండు నియోజకవర్గాల్లోనూ లెక్కలేనన్ని వినూత్న అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. చేపట్టే ప్రాజెక్టులన్నీ సామాన్యులకు ఏ విధంగా మేలు చేకూరుస్తాయన్న దానిపైనే దృష్టి సారిస్తున్నారు.
మహారాజాస్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ తరువాత ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుండి ఆర్థికశాస్త్రంలో పీహెచ్డీ చేశారు. ఆయన తిరువనంతపురంలోని సెంటర్ ఫర్ స్టడీస్లో ఫెలోగా కూడా ఉన్నారు. ఇప్పుడు సీడీఎస్, జీఐఎఫ్టీలో హానరరీ ఫెలోగా ఉన్నారు. ఎస్ఎఫ్ఐ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు థామస్ ఐజాక్ ప్రస్తుతం సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు.