– ఉమ్డా బజార్ స్కూల్లో భవితా సెంటర్లో పిల్లలకు స్పీచ్ థెరపీ
– జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య బోధనతో పాటు పాఠశాల అభివృద్ధికి పోటీపడి బాధ్యతగా పనిచేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాఠశాల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. బుధవారం బహదూర్పూరలోని ఉమ్డా ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా పాఠశాలలలో చేపట్టిన టాయిలెట్, ఫ్లోరింగ్, కలర్ పెయింటింగ్, నల్లాల ఫిట్టింగ్, పాఠశాల పరిసరాలను కలెక్టర్ పరిశీలించారు. పాఠశాలకు హెచ్ఎండబ్ల్యూఏ ద్వారా నీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాల వెనకవైపు చెత్త చెదారం ఉండటాన్ని గమనించి పాఠశాల ప్రధానోపాధ్యాయునిపై ఆగ్రహం వ్యక్తం చేసి.. వెంటనే చెత్తను తొలగించి పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. పాఠశాలలో హాజరు రిజిస్టర్, పరిశీలించి రికార్డులు అప్డేట్ చేయాలని ఆదేశించారు. పిల్లలందరికీ నోట్ బుక్స్, టెక్ట్స్ బుక్స్, యూనిఫారాలు అందాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఐఎస్ఎంఎస్ పోర్టల్లో ఆన్లైన్లో ఎప్పటికప్పుడు డేటా అప్డేట్ చేయాలని డేటా ఎంట్రీ ఆపరేటర్ను ఆదేశించారు. అనంతరం పాఠశాలలోని ల్యాబ్, ఆరో సెంటర్ స్టోర్ రూమ్ పరిశీలించి పాఠశాలలో ఉన్న స్క్రాప్ ను తొలగించాలని సూచించారు. పాఠశాల ఆవరణలోని భవిత సెంటర్లోని పిల్లలతో ముచ్చటించి వారి పేర్లను అడిగి తెలుసుకున్నారు. ఫిజియోథెరపీ డాక్టర్, ఉపాధ్యాయురాలి సేవలు బాగున్నాయని ప్రశంసించారు. భవిత సెంటర్లో బాగా వెలుతురు ఉండేలా అదనంగా 4 ట్యూబ్ లైట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రోజులు వారంలో రెండు రోజులు స్పీచ్ థెరపి డాక్టర్ సేవలు అందేలా ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాలల అభివృద్ధికి పోటీపడి పనిచేసి పాఠశాలను అందంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఈవో ఆర్.రోహిణి, జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి ఆశన్న, డిప్యూటీ ఈవో ఏ.సత్యవతి, డిప్యూటీ ఐవోఎస్ ఖలీల్, డీఈ రాజన్న, హెడ్మాస్టర్ మహమ్మద్ రఫీ, తహసిల్దార్, ఏఈ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.