రాష్ట్రంలో 44 మంది పోలీసు అధికారుల బదిలీ

–  23 మంది ఐపీఎస్‌ ఆఫీసర్లు
–  21 మంది నాన్‌క్యాడర్‌ ఎస్పీలు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో భారీ ఎత్తున పోలీసు అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం రాత్రి ఉత్వర్వులు జారీ చేసింది. ఇందులో పలు జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు కూడా ఉన్నారు. బదిలీ అయినవారిలో 23 మంది ఐపీఎస్‌ అధికారులు, 21 మంది నాన్‌క్యాడర్‌ ఎస్పీలున్నారు. రాష్ట్ర పోలీసు నియామక బోర్డు చైర్మెన్‌ వి.వి శ్రీనివాస రావ్‌ను రాష్ట్ర పోలీసు సాంకేతిక సేవల విభాగానికి బదిలీ చేశారు. అలాగే, టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ చైర్మెన్‌గా కొత్త అధికారిని నియమించేంత వరకు ఈ విభాగాన్ని శ్రీనివాస్‌కే అదనపు చార్జీగా అప్పగించారు. పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న గజరావ్‌ భూపాల్‌ను పోలీసు కోఆర్డినేషన్‌ డీఐజీగా నియమించి, రామగుండం కమిషనర్‌ రెమా రాజేశ్వరిని రాష్ట్ర మహిళా భద్రతా విభాగం డీఐజీగా బదిలీ చేశారు. డీఐజీ ఎల్‌.ఎస్‌.చౌహాన్‌ను రామగుండం కమిషనర్‌గా నియమించారు. హైదరాబాద్‌ ఎస్‌బీ డీసీపీ జోయెల్‌ డేవిస్‌ను జోగులాంబ రేంజ్‌ డీఐజీగా నియమించి, ఖమ్మం కమిషనర్‌ విష్ణు ఎస్‌ వారియర్‌ను డీజీపీ కార్యాలయానికి బదిలీ చేశారు. రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఎస్పీ పి.వి పద్మజను మల్కాజ్‌గిరి డీసీపీగా నియమించి, పోలీసు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌ జానకీ షర్మిలను నిర్మల్‌ ఎస్పీగా నియమించారు.
మల్కాజ్‌గిరి డీసీపి జానకీ ధరావత్‌ను ట్రాన్స్‌ఫర్‌ చేసి నగర సౌత్‌ ఈస్ట్‌ జోన్‌ డీసీపీగా పోస్టింగ్‌ ఇచ్చి నగర తూర్పు మండలం డీసీపీ సునీల్‌దత్‌ను ఖమ్మం కమిషనర్‌గా బదిలీ చేశారు. పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ను సీఐడీలో నియమించారు. ఆదిలాబాద్‌ ఎస్పీ డి. ఉదరు కుమార్‌ రెడ్డిని ట్రాన్స్‌కోకు బదిలీ చేసి.. గౌస్‌ ఆలమ్‌ను ఆదిలాబాద్‌ ఎస్పీగా నియమించారు. భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ వినిత్‌ను మాదాపూర్‌ డీసీపీగా నియమించి డాక్టర్‌ పి. శబరీశ్‌ను ములుగు ఎస్పీగా నియమించారు. పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న నితికా పంత్‌ను మేడ్చల్‌ జిల్లా ఎస్పీగా నియమించి.. సైబర్‌క్రైమ్‌ డీసీపీ బి. అనురాధకు సిద్ధిపేట్‌ కమిషనర్‌గా పోస్టింగ్‌ ఇచ్చారు. మరో ఎస్పీ ప్రవీణ్‌ కుమార్‌ను ఎల్బీనగర్‌ డీసీపీగా నియమించి, నగర సౌత్‌ ఈస్ట్‌ డీసీపీ బిరుదరాజు రోహిత్‌ రాజును భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీగా నియమించారు.
నగర సౌత్‌వెస్ట్‌ డీసీపీ బాలస్వామిని మెదక్‌ ఎస్పీగా బదిలీ చేశారు. ములుగు ఓఎస్డీ అశోక్‌ కుమార్‌ను ప్రొఫెసర్‌ జయశంకర్‌ భూపాలపల్లి ఓఎస్డీగా బదిలీ చేసి.. పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న వెంకటేశ్వర్లును నగర ట్రాఫిక్‌ డీసీపీ-3గా ట్రాన్స్‌ఫర్‌ చేశారు. పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న మరో డీసీపీ సీహెచ్‌ శ్రీనివాస్‌ను రాజేంద్రనగర్‌ జోన్‌ డీసీపీగా నియమించారు. వీరితో పాటు మరో 21 మంది నాన్‌క్యాడర్‌ ఎస్పీలనూ బదిలీ చేశారు.