సీఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్‌ను కలిసిన ట్రెసా బృందం

– పదోన్నతులు కల్పించాలని విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రెవెన్యూ శాఖలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్‌, తహసీల్దార్ల పదోన్నతులు కల్పించాలని ట్రెసా రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్‌కుమార్‌లతో కూడిన ప్రతినిధి బృందం శుక్రవారం సచివాలయంలో సీఎంఓ కార్యదర్శి స్మితాసభర్వాల్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. సీఎం దష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్‌ పదోన్నతులు కల్పించాలని కోరారు. 2016 తర్వాత ఏడేండ్ల నుంచి డిప్యూటీ కలెక్టర్‌ ప్రమోషన్లు రాలేదని, దానివల్ల కింద స్థాయి జూనియర్‌ అసిస్టెంట్‌ నుంచి డిప్యూటీ తహసీల్దార్‌ వరకు వివిధ కేడర్లలో పదోన్నతులు రాక స్థబ్దత నెలకొన్నదని తెలిపారు. అన్ని శాఖల మాదిరిగా రెవెన్యూలో కూడా పదోన్నతులు కల్పించాలని కోరగా, స్మితాసభర్వాల్‌ సానుకూలంగా స్పందించి సీఎం దష్టికి తీసుకెళ్తానని హామీనిచ్చారు. అనంతరం వివిధ జిల్లాల నుండి వచ్చిన డిప్యూటీ తహసీల్దార్లు, తహసీల్దార్లు ట్రెసా ఆధ్వర్యంలో రెవెన్యూ ముఖ్యకార్యదర్శి, సీసీఎల్‌ఏ నవీన్‌మిట్టల్‌ను సీసీఎల్‌ఏ కార్యాలయంలో కలిసి ప్రమోషన్ల గురించి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ట్రెసా అసోసియేట్‌ అధ్యక్షులు మన్నె ప్రభాకర్‌, రాష్ట్ర నాయకులు పి.రమేష్‌, ఖమ్మం, జగిత్యాల్‌ జిల్లా అధ్యక్షులు సునీల్‌, ఎండీ.వకీల్‌, కార్యవర్గ సభ్యులు సుమ, నిర్మలదేవి, శ్రీలత, మధు, వెంకటేష్‌, పవన్‌ తదితరులు పాల్గొన్నారు.