గిరిజన నియోజక వర్గం…

– గిరిజనేతర్లు దే పెత్తనం…
– లబ్ధిదారుల ఎంపికలో పోటాపోటీ…
– సీట్ల ఎంపిక లోనూ వారిదే పై చేయి…
– రాజకీయ స్వయం శక్తిగా ఎదగ లేక పోతున్న గిరిజనులు…
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట నియోజక వర్గం గిరిజనుల రిజర్వడ్ స్థానం అయినప్పటికీ ఇక్కడ గిరిజనేతర్లు అయిన పెత్తందారులు దే పై చేయి ఉంటుంది.ప్రభుత్వ పధకాల లబ్ధిదారుల ఎంపిక లోనూ సంబంధిత ఎమ్మెల్యే కంటే ఆయన చుట్టూ ఉండే అగ్రవర్ణ నాయకులే చక్రం తిప్పుతారు అంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ ఏ పార్టీ లో ఎవరికి సీటు ఖరారు చేయాలన్నా ఆయా పార్టీలో కమ్మ,రెడ్డి,వెలమ నాయకుల కనుసన్నల్లో జరగాల్సిందే. ఇక్కడ గిరిజనుల్లో చదువు,రాజకీయ పరిజ్ఞానం ఉండీ రాజకీయ స్వయం శక్తిగా ఎదగ లేక పోవడానికి కారణం ఈ నియోజక వర్గంలో రాజకీయంగా ఒక తరం ముందు ఉన్న అత్యధికులు గిరిజనేతర్లు కావడమే.
 మండలాలు వారీగా…
చండ్రుగొండ మండలంలో కాంగ్రెస్,బీఆర్ఎస్ ల్లో రెడ్డి సామాజిక వర్గం,లంబాడీ సామాజిక వర్గం రాజకీయంగా ముందున్న ఉన్నా అగ్రవర్ణ పెత్తనమే పై చేయి సాధిస్తుంది. అన్నపురెడ్డిపల్లి మండలంలో కాంగ్రెస్,బీఆర్ఎస్ ల్లో గౌడ,వెలమ సామాజిక వర్గం నాయకులు వ్యూహకర్తలు.ములకలపల్లి లో కాంగ్రెస్,బీఆర్ఎస్ ల్లో కమ్మ,కాపు, వెలమ సామాజిక వర్గాలు చక్రం తిప్పుతారు. దమ్మపేట మండలంలో కాంగ్రెస్,బీఆర్ఎస్ ల్లో కమ్మ,వెలమ,ఆర్యవైశ్య, సామాజిక వర్గాలు క్రియాశీలకంగా ఉంటాయి. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మండలంలో కమ్మ,వెలమ,ఆర్యవైశ్యులు తో పాటు కాపులు,రెడ్డి సామాజిక వర్గాలు పెత్తనం కోసం పోటి పడుతున్నాయి. ఈ నియోజక వర్గం ప్రధమ ఎమ్మెల్యే వగ్గెల మిత్ర సేన నాడు కాంగ్రెస్ లో ఉన్న పొంగులేటి సుధాకర్ రెడ్డి,రేణుకా చౌదరి అనుచరుడిగా ఉండేవారు. రెండో ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు నాడు వైఎస్ ఆర్ సీపీ లో పొంగులేటి అనుచరుడిగా విజయం సాధించిన విషయం మనకు తెలిసిందే. ప్రస్తుత ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సైతం నాడు తెలుగు దేశం పార్టీ నుండి కమ్మ సామాజిక వర్గం చేయూత తో విజయం సాధించారు.ప్రస్తుత బీఆర్ఎస్ లోనూ ఆయన చుట్టు గిరిజనేతర్లు అయిన అగ్రవర్ణ సామాజిక వర్గం నాయకులే పెత్తనం కోసం పోటి పడుతుండటం హాట్ టాపిక్ గా ఉంది. కాంగ్రెస్ సీటు కు దరఖాస్తు చేసుకున్న ప్రధాన పోటీదారులు ఐన సున్నం నాగమణి కి మల్లు భట్టి విక్రమార్క,తాటి వెంకటేశ్వర్లు కు తుమ్మల నాగేశ్వరరావు, జారే ఆదినారాయణ కు పొంగులేటి శ్రీనివాస రెడ్డి లు మద్దతు తెలుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.