స్వతంత్రంగా తప్ప, నిజాలు నమ్మకాల మీద నిలబడవు

మట్టికి బంగారానికీ మధ్య ఎంతో భేదం ఉంది. కానీ, బ్రాహ్మణునికి చండాలునికి మధ్య అటువంటి తేడా ఏమీ లేదు. ఎండు కట్టెలను రాపిడి చేస్తే అగ్ని పుట్టినట్టుగా బ్రాహ్మణుడు పుట్టలేదు. ఆకాశం లేదా గాలి నుండి బ్రాహ్మణులు ఊడి పడలేదు. భూమిని తొలుచుకుని పైకి రాలేదు. చండాలుడు ఒక స్త్రీ గర్భం నుండి పుట్టినట్టే బ్రాహ్మణులు కూడా పుట్టారు. మానవులందరికీ ఒకే రకమైన అవయవాలు ఉన్నాయి. వారి శరీర నిర్మాణంలో ఏ విధమైన భిన్నత్వం లేదు. అలాంటప్పుడు బ్రాహ్మణులను భిన్నమైన జాతిగా ఎందుకు చూడాలి? మనుషుల మధ్య అసమానతను పాటించడం ప్రకృతి విరుద్ధం-‘బౌద్ధం అంటే ఏమిటీ?’ గ్రంథ రచయిత ప్రొఫెసర్‌ పోకల లక్ష్మీ నరసు-అంబేద్కర్‌ను ప్రభావితం చేసిన ఆధునిక బౌద్ధ ఉద్యమకారుడు.
ఏ సంస్కృతిలోనైనా పండుగలు, పర్వదినాలు జరుపుకోవా లంటే కేలండర్‌ అత్యవసరం. ప్రపంచంలో ఒక్కొక్క మతం ఒక్కొక్క కేలండర్‌ రూపొందించుకుంది. రోమన్‌లు తమ కాలంలో రోమన్‌ కేలండర్‌ ఏర్పర్చుకున్నారు. తర్వాత కాలంలో క్రీస్తు పుట్టిన తేదీని అనుసరించి కొంచెం అటూ ఇటూగా వాళ్లు గ్రిగేరియన్‌ కేలండర్‌ వాడుకలోకి తెచ్చుకున్నారు. ఇస్లాం కూడా మహ్మద్‌ సమయాన్ని అను సరించి మక్కామదీనాకు వెళ్లడానికి అనుకూల సమయాలు నిర్ణయించుకున్నారు. అలాగే, భారత దేశంలో శకసంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని, సాధారణ శకం 78 నుండి అంటే బౌద్ధరాజు కనిష్కుడి కాలం నుండి బౌద్ధుల కేలండర్‌ వాడుకలోకి వచ్చింది. బుద్ధుడి కాలం నుండి ఉన్న యుగాబ్ది కేలండర్‌ను బట్టి బౌద్ధ దేశాలన్నీ తమ పండుగలు. పర్వదానాలు ఏర్పరుచుకున్నాయి. కనిష్టుడు భారతదేశంలో బౌద్ధ ధమ్మాన్ని ప్రచారం చేసినప్పుడు ఈ శక సంవత్సరానికి చాలా ప్రాముఖ్యం పెరిగింది. పురాతన శిలాశాసనాలన్నింటిలో ఈ కేలండర్‌ను బట్టే అప్పటి కాలాన్ని సూచిస్తూ వచ్చారు. తొమ్మిదో శతాబ్దంలో తొలిసారి విక్రమనామ సంవత్సరానికి సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇది కూడా శక సంవత్సరం లాంటిదే. కాని వీటి మధ్య 15 రోజుల తేడా ఉంటుంది. సిథియన్లు కూడా బౌద్ధులే. వారు కూడా దీన్ని వాడేవారు. అయితే, వారు దీన్ని మాల్యా సంవత్సరం అని అనేవారు. సాధారణ శకానికి పూర్వం 58 దీజజు నుండి వారు ఈ మాల్యా సంవత్సరం ప్రారంభించు కున్నారు. ఇదే మాల్యాను 9వ శతాబ్దం తర్వాత, వారు దాన్ని విక్రమనామ సంవత్సరమన్నారు.
భారతీయులంతా ఇప్పుడు శక సంవత్సరాన్నే ఉపయోగిస్తున్నారు. ఈ రోజు హిందూ కేలండర్‌ అని దేన్నయితే అంటున్నామో, అది హిందువులు రూపొందించుకున్నది కాదు అది బౌద్ధుల కేలండర్‌! అందుకే అందులో మొదటి నెల ‘చైత్యం’ అని ఉంటుంది. బుద్ధుల చైత్యం-స్థూపాల ప్రతీకగా వారు చైత్యంతో ప్రారంభించుకున్నారు. దాన్ని సంస్కృతీకరించి వైదిక మతస్థులు చైత్రం అని అన్నారు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం బౌద్ధ కేలండర్‌నే స్వీకరించింది. బౌద్ధ చక్రాన్ని, అశోక స్థూపాల్ని, సింహాల్ని భారత ప్రభుత్వం తమ అధికార చిహ్నాలుగా చేసుకుంది. ఆ కేలండర్‌ చూసే బ్రాహ్మనిజానికి సంబంధించిన పురోహితులు దక్షిణ తీసుకుని తిధి, వార, నక్షత్రాలు చెపుతారు. అంటే దానితో వ్యాపారం చేసుకోవడం ప్రారంభించారన్న మాట! నాసా కోట్ల రూపాయలు ఖర్చు చేసి, సూర్య చంద్రుల కదలికల్ని తెలుసుకుంటుందనీ, అదే విషయం తాము ఇక్కడ కొద్దిపాటి దక్షిణ తీసుకుని సరిగా చెపుతుంటామని ప్రచారం చేసుకున్నారు. కొందరు అమాయకులు, ఎంతో మంది మూర్ఖ శిఖమణులు ఉన్న దేశం కాబట్టి, ఇక్కడ వారి వ్యాపారం సజావుగా సాగుతూ వస్తోంది. ఇది మన రుషి పుంగవులు రూపొందించిన పంచాంగమని, దాని ప్రకారమే కేలండర్‌ వాడుకలోకి వచ్చిందనీ మనువాదులు ప్రచారం చేసుకున్నారు. అలా బౌద్ధ కేలండర్‌కు కూడా అన్యాయం జరిగింది-
బ్రాహ్మనిజానికి వకాల్తా పుచ్చుకునే వారు ఒక చిన్న ప్రశ్నకు జవాబు చెప్పలేరు. శక సంవత్సరం, అనే పదం పంచాగాల్లో, కేలండర్‌లలో ఎందుకుందీ? శక-అంటే ఎవ్వరిదీ? శాక్యగణం ఎవ్వరిది? అది బుద్ధుడిది కదా? ప్రపంచంలోని మతాలకు ఎవరి కేలండర్‌ వారికి ఉంటే, మరి బ్రాహ్మ నిజానికి ప్రత్యేకంగా ఒక కేలండర్‌ ఎందుకు లేదూ? బౌద్ధ కేలండర్‌ నిర్ధారించిన ప్రకారమే వైదిక మతస్తులు పండగలు ఎందుకు జరుపుకుంటున్నారూ? వంటి ప్రశ్నలు ఉత్పన్న మౌతున్నాయి. బౌద్ధాన్ని నాశనం చేసే పనిలో వైదికులు బౌద్ధుల కేలండర్‌ను కూడా వదలలేదు. ఇప్పుడు దేశంలో వాడుకలో కన్న కేలండర్‌ బౌద్ధులదే- ఒక రకంగా వారు కుట్ర పూరితంగా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకు న్నారు. నిజమే! కానీ, వెలుగుల్ని కప్పేయడం, సత్యాన్ని దాచడం ఎవరి వల్లా కాదు. సత్యాలు బయటి కొస్తున్నాయి. వెలుగులు విస్తరిస్తు న్నాయి. ప్రతి చోటా బయట పడుతున్న బౌద్ధ శిల్పాలు గత చరిత్రను కండ్లకు కట్టిస్తున్నాయి. వెలుగుల్ని తట్టుకోలేని వారు, సత్యాన్ని భరించలేని వారు- కల్పిత పాత్రలకు ఆలయాలు కట్టి మురిసిపోయే మూర్ఖ శిఖామణు లుంటారు. తప్పదు! చెడు ఉంటేనే కదా మంచి విలువ తెలిసొచ్చేది?
‘సర్వ భాషలకు జనని మా సంస్కృతం’ అని గొప్పగా చెప్పుకుంటారే గాని, సరైన ఆధారాలు ఇవ్వలేరు. ఈ దేశానికి వలస వచ్చిన ఆర్యులు తమతో తెచ్చిన సంస్కృతం ఒక మాండలికమని, దానికి లిపి లేదనీ ఒప్పుకోరు. వారు ఒప్పుకోకపోయినా చారిత్రక ఆధారాలు ఇలా ఉన్నాయి. వారు వచ్చేనాటికే ఈ దేశంలో నాగరి లిపి ఉంది. ఆ భాష ఎవరిదీ? ఈ దేశ మూలవాసులైన నాగజాతి ఆదివాసుల భాష. నాగరి లిపిలో వారి సంస్కృతాన్ని రాసుకుని, నాగరిని దేవాగరి అని అన్నారు. తమ సంస్కృతాన్ని ఏకంగా దేవభాష అని ఉన్నతీకరించుకున్నారు. బుద్ధుడి కాలంలో ప్రజల భాష పాలి. దాని లిపి ధమ్మ లిపి దాన్నే బ్రాహ్మి లిపి అని కూడా అన్నారు. ప్రజల భాష పాలిలోనే బుద్ధుడు తన బోధనల్ని బోధించాడు. అశోకుడి శిలా శాసనాలన్నీ పాలి, ప్రాకృత భాషల్లో ఉన్నాయి. ప్రాకృత – అంటే ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది అని- సంస్కృతం అంటే సంస్కరించబడిందనీ అర్థాలు, సంస్కరించబడింది. మూల భాష కాలేదు కదా? పాలి, ప్రాకృతం ప్రపంచం లోనే అతి ప్రాచీనమైన భాషలు, ఇటీవల ఒక విదేశీ పరిశోధకుడు ఫ్రెంచ్‌ భాషలో ఇరవైకి పైగా పాలిభాషా పదాలు ఉన్నట్టు నిర్ధారించాడు. తర్వాత కాలాలలో ఏర్పడుతూ వచ్చిన భాషల మీద ప్రాచీన భాషల ప్రభావం తప్పక ఉంటుంది. లిపి లేని ఒక మాండలిక – సంస్కృత భాష సర్వభాషలకు జనని కాగలదా?
ఇక్కడ మరొక విషయం గుర్తు పెట్టుకోవాలి. నాగజాతి వారంతా బౌద్ధులు. వారు అధిక సంఖ్యలో ఉన్న ప్రదేశాలన్నీ నాగ పేరుతో మొదలవుతాయి. కశ్మీర్‌లో అనంత్‌ నాగ్‌, మహారాష్ట్రలో నాగ్‌పూర్‌ వంటివి. బౌద్ధానికీ నాగవంశానికీ ఉన్న అవినాభావ సంబంధం వల్లనే, డా.అంబేద్కర్‌, బౌద్ధం నాగ్‌పూర్‌లో స్వీకరించాడు. ఇక ధమ్మ లిపి గురించి చూద్దాం. ధమ్మ అనేది పాలి భాషా పదం. దానికి ‘ధరించేది’ అని అర్థం లేదా వహించేది – ఏ మాటల్ని మనసు ధరించి లేదా వహించి – మనసును ఆవహించి దు:ఖపడదో – ఏ పలుకులు వినడం వల్ల మనసు మలిన రహితం అవుతుందో అదే ధమ్మపదం! ధమ్మపదం త్రిపిటకాల్లో – బుద్దకనికాయంలో భాగం. ఇవి బుద్ధుడు ప్రత్యక్షంగా చెప్పిన గాథలు కావు. బుద్ధుని బోధనల సారం ! బుద్ధుడి సందేశాల్ని సంస్కృతంలోకి అనువదిస్తామనీ, అందుకు అనుమతించమనీ యమేలుడు – తేలకుడు అనే ఇద్దరు భిక్షువులు బుద్ధుణ్ణి అడిగారు. అందుకు బుద్ధుడు సమ్మతించలేదు. పైగా ‘వద్ధు’ అని వారించాడు. ”నా సందేశాల్ని ఎప్పుడూ సంస్కృతంలోకి మార్చోద్దు”- అని స్పష్టం చేశాడు. ఎందుకంటే-తను చెప్పిన దానికి పెడర్థాలు తీసి వక్రీకరించి, ధమ్మాన్ని అపఖ్యాతి పాలు చేస్తారని ఆయన ఆనాడే గ్రహించాడు.
బుద్ధుడు 14 రకాల జ్ఞానాల్ని అందించాడని అన్నాడు- భదంతుజ్ఞాన జ్యోతి. ఈయన బుద్ధుణ్ణి ఒక ‘జ్ఞాన శిల్పకారుడి’గా కూడా వర్ణించాడు. అది తధాగతుడైన సమ్యక్‌ సంభుద్ధుడికే సాధ్యం- అని అన్నాడాయన, అలాగే మరో విషయం కూడా చూడండి. వైదిక మతస్థులు స్వతం చేసుకున్న కాషాయ రంగు ఎవరిదీ? అది బుద్ధుడిది! బుద్ధుడి జీవికకు ప్రతీక! అది ప్రేమ, కరుణ, క్షమలకు ప్రతీక! ఈ కాషాయరంగు ఛత్రపతి శివాజీ శౌర్యానికి పరమత సహనానికీ ప్రతీక! ఈ కాషాయరంగే అమర వీరుడైన ‘షహీదే ఆజం’-భగత్‌సింగ్‌ త్యాగానికి ప్రతీక! బుద్ధుడి తర్వాత కాషాయాన్ని వాడిన శివాజీ, భగత్‌సింగ్‌లు దేశ ప్రతిష్టను ఇనుమడింపజేశారు. దిగజార్చలేదు. వారు ఏ ధార్మిక భావనల్ని ప్రచారం చేయలేదు. కాషాయపు స్థాయిని తగ్గించలేదు. సమకాలీనంలో ఆ రంగును దౌర్జన్యానికి, దోపిడీకి, అధికార మదానికీ, అసహనానికీ వాడుకుంటున్నది ఎవరో ఇప్పుడు అందరికీ తెలుసు. జై శ్రీరామ్‌ నినా దంతో ప్రజల మానాల్ని, ప్రాణాల్ని దోపిడీ చేస్తూ ఇండ్ల మీదికి బుల్‌డోజర్లు పంపిస్తూ, తమది డబు లింజన్‌ సర్కార్‌ అని డప్పు కొట్టుకుంటున్నది ఎవరో..ఇప్పుడు అందరికీ తెలుసు. ఈ కాషాయాన్ని అడ్డు పెట్టుకునే కదా వీరు గుజరాత్‌ – మణిపూర్‌ మారణకాండలు జరిపించారూ? ప్రపంచ దేశాల్లో దేశానికున్న పరువు ప్రతిష్టల్ని దిగజార్చారూ? నిట్టనిలువునా కూల్చేశారూ? కాల్చేశారూ? అందుకే మహాకవి శ్రీశ్రీ అన్నాడు ”కుష్టువ్యాధి ఉన్నోడినైనా ముట్టుకో – కానీ, మత పిచ్చి ఉన్నోడి జోలికి వెళ్లకు. ఎందు కంటే వాళ్లు కనబడే మనుషులకంటే కనరాని మతాలకే ఎక్కువ విలువస్తారు”అనీ!
తారాదేవి (స్త్రీ బోధితస్య) విగ్రహాలు మార్చి దుర్గ, కాళి, సరస్వతి, లక్ష్మి, పార్వతి వంటి విగ్ర హాలుగా చెలామణిలోకి తెచ్చి, తమ జీవనాధారం చూసుకున్న హైందవ పురోహితులు, తమ చారిత్రక తప్పిదాన్ని గ్రహించలేకపోయారు. అయితే మరి ఆ దేవతల విగ్రహాలపైన, చుట్టుపక్కల బుద్ధుడి ఆ కృతులు ఎందుకున్నట్టూ? నిజాల్ని అన్వేషించే వారికి విషయం అర్థమవుతుంది. కండ్ల ముందు ఉన్నా చూడకుండా, అర్థం చేసుకోకుండా, మెదళ్లను మూసుకుని-ఊరికే మనోభావాలు దెబ్బతీసుకునే వారికి ఏం చెప్పగలం? ఇంతెందుకూ? ‘మాతృ దేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ’-అనే పదాలు వినగానే ఇవి హైందవానికి సంబంధించినవి అని అనిపిస్తుంది. కానీ, ఈ పదాలు మొదట ఉచ్ఛ రించింది గౌతమ బుద్ధుడు. ఆయన పాలి భాషలో చెప్పిందే సంస్కృతంలోకి మార్చుకుని బ్రాహ్మ ణార్యులు ప్రచారం చేసుకున్నారు. ఏ చిన్న విషయం కూడా వారు మార్చుకోకుండా వదిలేయలేదు. అయితే బ్రాహ్మనిజానికి భజన చేస్తూ తిరిగే బహుజన-పిచ్చిజనం వాస్తవాలు గ్రహించలేక పోతున్నారు. కండ్లగంతలు విప్పేస్తే, పరాయీకరణ మానేస్తే నిజాలు కనిపిస్తాయి. ప్రస్తుతం మనం ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామంటే నాటకాలు, డ్రామాలు చూసి బాధపడుతూ భోరున ఏడుస్తున్నాం. వాస్తవాలకు మాత్రం స్పందించలేకపోతున్నాం – ఈ పరిస్థితిలోంచి బయటపడాలి!
– సుప్రసిద్ధ సాహితీవేత్త, విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్‌ (మెల్బోర్న్‌ నుంచి)
– డాక్టర్‌ దేవరాజు మహారాజు