– జూనియర్ వరల్డ్ చాంపియన్షిప్
న్యూఢిల్లీ: ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ చాంపియన్షిప్ (రైఫిల్/పిస్టల్/షాట్గన్)ను భారత యువ షూటర్లు ఘనంగా మొదలెట్టారు. తొలి రోజు రెండు స్వర్ణాలు సొంతం చేసుకున్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మెన్స్, ఉమెన్స్ జట్లు బంగారు పతకాలు సాధించాయి. మెన్స్ త్రయం ఉమేశ్ చౌదరి, ప్రద్యుమ్ సింగ్, ముకేశ్లు జట్టు విభాగంలో టాప్ లేపారు. 1726 పాయింట్లతో సిల్వర్ సాధించిన రోమానియా కంటే పది పాయింట్ల ముందంజలో నిలిచారు. మహిళల త్రయం కనిష్క, లక్షిత, అంజలి చౌదరి 1708 పాయింట్లతో స్వర్ణం గెల్చుకుంది. అజర్బైజాన్, ఉక్రెయిన్లు సిల్వర్, బ్రాంజ్ దక్కించుకున్నారు. మెన్స్ వ్యక్తిగత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఉమేశ్ చౌదరి పతకం సాధించే అవకాశం కోల్పోయాడు. షూటింగ్ రేంజ్కు ఆలస్యంగా వచ్చినందుకు అతడిపై నిర్వాహకులు రెండు పాయింట్ల కోత విధించారు. దీంతో పతక పోరులో ఉమేశ్ ఆరో స్థానానికి పరిమితమై మెడల్ చేజార్చుకున్నాడు.