– ఐదుగురు మృతి
టోక్యో : టోక్యోలోని హనెడా విమానాశ్రయంలో మంగళవారం ఘోర ప్రమాదం సంభవించింది. జపాన్ కోస్ట్ గార్డ్్ విమానంతో పాసింజర్ విమానం ఢ కొనడంతో క్షణాల వ్యవధిలోనే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. ఈ దుర్ఘటనలో ఐదుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు. జపాన్ ఎయిర్లైన్స్కి చెందిన విమానంలో పూర్తిగా మంటలు వ్యాపించడానికి ముందుగానే అందులోని 379మంది ప్రయాణికులు సురక్షితంగా దిగిపోయినట్లు ఎన్హెచ్కె టివి తెలియచేసింది. జపాన్ కోస్ట్ గార్డ్ విమానం పైలట్ కూడా ఈ ప్రమాదం నుండి తప్పించుకోగలిగారని కోస్ట్ గార్డ్ అధికారులు చెప్పారు. అయితే విమానంలోని ఐదుగురు సిబ్బంది చనిపోయినట్లు టివి వార్తలు తెలిపాయి. జపాన్ ఎయిర్లైన్స్కి చెందిన విమానం రన్వే పై వుండగానే పెద్ద ఎత్తున మంటలు, పొగ కమ్ముకోవడం స్థానిక టివి దృశ్యాల్లో కనిపిస్తోంది. విమానం రెక్కకు నిప్పంటుకోవడం, ఒక గంట తర్వాత మొత్తంగా మంటల్లో విమానం చిక్కుకోవడం కనిపిస్తోంది. ప్రమాదానికి గురైన ఎయిర్బస్ ఎ-350 షిన్ చిటొసె విమానాశ్రయం నుండి హనెడా విమానాశ్రయానికి ప్రయాణించింది. తమ విమానం ఎంఎ-722తో ప్రయాణికుల విమానం ఢ కొట్టిందని కోస్ట్ గార్డ్ ప్రతినిధి యోషినొరి యాంగ్షిమా ధృవీకరించారు. కోస్ట్ గార్డ్ విమానం భూకంప బాధితుల కోసం సహాయాన్ని తీసుకుని నైజీరియా వెళ్ళాల్సి వుంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలోనే వున్న ప్రయాణికుడు స్వీడ్ ఆంటన్ మాట్లాడుతూ, ఢ కొట్టిన వెంటనే కొద్ది నిముషాల వ్యవధిలో కేబిన్ అంతా పొగ కమ్ముకుపోయిందని, వెంటనే అత్యవసర ద్వారాలు తెరుచుకున్నాయని, తమను కిందకు దింపివేశారని చెప్పారు. అస్సలేం జరుగుతోందో కొద్ది సేపు అర్ధం కాలేదని, అదొక భయంకరమైన అనుభవమని స్వీడ్ వ్యాఖ్యానించారు.