– లోక్ సభ బడ్జెట్ సమావేశాల్లో ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో హైదరాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కటే ఉందని, మూడు కొత్తగా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులు, మూడు బ్రౌన్ ఫీల్డ్ విమానాశ్రయాలు నిర్మించాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామ్రెడ్డి కోరారు. లోక్ సభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం ఎంపీ మాట్లాడారు. భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో వీటిని నిర్మించాలని వివరించారు. మామునూరు- వరంగల్ అర్బన్ జిల్లా మామునూర్లో బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మించాలన్నారు. పెద్దపల్లి జిల్లా బాసత్నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో వినియోగంలోకి తేవాలని కోరారు. హైదరాబాద్ నుంచి ఎక్కువ దూరంలో ఉన్న జిల్లాల కోసం కొత్త ఎయిర్పోర్టులు నిర్మించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. ఎయిర్ పోర్టు అథారిటీ గతంలోనే భూ పటుత్వం, సాంకేతిక, ఇతర సర్వేలన్నీ పూర్తి చేసి..ఆమోదం తెలిపిందని ఎంపీ రఘురాంరెడ్డి తెలిపారు. పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు స్పందించి వీలైనంత త్వరలో తెలంగాణలో ఎయిర్పోర్టుల నిర్మాణం చేపట్టాలని, కనీసం రెండింటినైనా పూర్తి చేయాలని కోరారు.