కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం..

Union Minister of State Bandi Sanjay's effigy burnt.నవతెలంగాణ – జమ్మికుంట
 కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దిష్టిబొమ్మ ను  మంగళవారం స్థానిక గాంధీ చౌరస్తాలో మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. సందర్భంగా యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బుడిగె శ్రీకాంత్ మాట్లాడారు.దేశ మాజీ ప్రధానిగా ఎన్నో సంస్కరణలు చేసి ఈ దేశానికి సేవలందించిన ఉక్కు మహిళ ఇందిరా గాంధీని ఉగ్రవాది తో పోల్చడంపై బండి సంజయ్ వాఖ్యలను  తీవ్రంగా ఖండిస్తున్నా మని అన్నారు. కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి ఈ విధంగా మాట్లాడడం నీతిమాలిన చర్య అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్లు పథకంలో ఇందిరమ్మ ఫోటో ఉంటే మీకు ఇల్లు ఇవ్వమని చెప్పడం దుర్మార్గమన్నారు.  ఇందిరమ్మ ఇండ్లు పథకంలో 100 లో 85 శాతం రాష్ట్ర ప్రభుత్వం నిధులు అయితే,  బిజెపి ప్రభుత్వం 15 శాతం వాటా  మీ ప్రభుత్వం ఇస్తే ,నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడాలన్నారు . ప్రజా యుద్ధనౌక గద్దర్  నక్సలైటు ,హంతకుడు, బిజెపి భావాజాలం లేని వ్యక్తికి మేము ఎలా అవార్డులు ఇస్తామని అనడం ఆయన అవివేకానికి నిదర్శనం అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ చదివినప్పటికీ విదేశాలలో ఉద్యోగం చేస్తూ బంగారు జీవితాన్ని గడిపే అవకాశం ఉన్నప్పటికీ, పేద ప్రజలు బడుగు బలహీన వర్గాల కోసం తన గళంతో ప్రజలను చైతన్యం చేసి తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంలో ముఖ్య భూమిక పోషించారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే ఆదరణను ఓర్వలేక అవాకులు – చేవాకులు మాట్లాడుతున్నావని, నీ అర్థం పర్థం లేని మాటలతో తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నావని, ఇలాగే కొనసాగితే  బండి సంజయ్ ని ఎక్కడికక్కడ  అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు అన్నం ప్రవీణ్,  యూత్ కాంగ్రెస్ నాయకులు అభిలాష్,   శ్రీకాంత్,  అజయ్, వెంకటేష్,  గణేష్, జావిద్, రాజ్ కుమార్, అష్రఫ్, శివ, రాకేష్, తదితరులు పాల్గొన్నారు.