రొటీన్‌కి భిన్నంగా ..

రొటీన్‌కి భిన్నంగా ..అల్లు శిరీష్‌ హీరోగా నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ ‘బడ్డీ’. గాయత్రి భరద్వాజ్‌, ప్రిషా రాజేశ్‌ సింగ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌ ఫిలింస్‌ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా, అధన జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్నారు. శామ్‌ ఆంటోన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నేహ జ్ఞానవేల్‌ రాజా కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. యూత్‌ ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. జూలై 26న ఈ సినిమా గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ చిత్ర ట్రైలర్‌ రిలీజ్‌ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ రాజా మాట్లాడుతూ, ‘గీతా ఆర్ట్స్‌, స్టూడియో గ్రీన్‌ కలిసి శామ్‌ ఆంటోన్‌ దర్శకత్వంలో ‘ప్రేమకథా చిత్రమ్‌’ సినిమాను తమిళంలో రీమేక్‌ చేశాం. ఆ సినిమాలో జీవీ ప్రకాష్‌ను హీరోగా ఇంట్రడ్యూస్‌ చేశాం. సంక్రాంతికి రిలీజైన ఆ సినిమా తమిళంలో మంచి హిట్‌ అయ్యింది. ఇప్పుడు బడ్డీ మూవీ చేస్తున్నాం. ఈ చిత్రంలో అలీ, అజ్మల్‌ బాగా సపోర్ట్‌ చేశారు. శామ్‌ మా సంస్థకు మరో మంచి సినిమా ఇస్తున్నారు’ అని తెలిపారు. హీరోయిన్‌ గాయత్రి భరద్వాజ్‌ మాట్లాడుతూ, ‘ఈ సినిమా కథను దర్శకుడు శామ్‌ చెప్పినప్పుడే ఇదొక స్పెషల్‌ ఫిల్మ్‌ అవుతుందని నమ్మాను. ఈ కథ వైడ్‌ రేంజ్‌ ఆఫ్‌ ఆడియెన్స్‌కు రీచ్‌ అయ్యేలా ఉంటుంది’ అని అన్నారు. ‘స్టూడియో గ్రీన్‌ లాంటి బిగ్‌ ప్రొడక్షన్‌లో ఫస్ట్‌ మూవీ హీరోయిన్‌గా నటించే అవకాశం రావడం అదష్టంగా భావిస్తున్నాను’ అని హీరోయిన్‌ ప్రిషా రాజేశ్‌ సింగ్‌ చెప్పారు.
దర్శకుడు శామ్‌ ఆంటోన్‌ మాట్లాడుతూ,’జ్ఞానవేల్‌ రాజా ఈ సినిమా కోసం డిస్కషన్‌ జరిగినప్పుడు నన్ను స్క్రిప్ట్‌ కూడా అడగలేదు. కేవలం నా మీద నమ్మకంతో ఈ మూవీ ఇచ్చారు. సీజీ అయ్యాక ఫైనల్‌ వెర్షన్‌ సినిమా చూశారు. ఆయనకు సినిమా బాగా నచ్చింది. ఆయన తర్వాత నా మీద నమ్మకం ఉంచిన మరో పర్సన్‌ శిరీష్‌’ అని తెలిపారు.
‘టెడ్డీ బేర్‌తో ఎడ్వెంచర్‌ యాక్షన్‌ మూవీని ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారు అనుకున్నా. కానీ ఇవాళ ట్రైలర్‌ చూశాక నాకు చాలా కాన్ఫిడెన్స్‌ వచ్చింది. కొత్త తరహా సినిమా ఎప్పుడు వచ్చినా మన ప్రేక్షకులు రిసీవ్‌ చేసుకుంటారు. ఇది రెగ్యులర్‌ టైప్‌ మూవీ కాదు. కొత్తగా ఉంటుంది’ అని హీరో అల్లు శిరీష్‌ చెప్పారు.