మైక్రోసాఫ్ట్‌లో ఆగని ఉద్వాసనలు

– మెటాలోనూ కోతలు
శాన్‌ఫ్రాన్సిస్కో : ఆర్థిక సంక్షోభం భయాల్లో టెక్‌ కంపెనీలు వరుస పెట్టి ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి. ప్రముఖ టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ వరుసగా మూడో విడత తమ ఉద్యోగులకు ఉద్వాసనలు పలికుతుందని సమాచారం. ఈ సారి సప్లరు చెయిన్‌, క్లౌడ్‌, కృత్రిమ మేధ (ఎఐ), ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింక్స్‌ వంటి విభాగాల్లోని వారిని తొలగించినట్లు శనివారం రిపోర్టులు వచ్చాయి. 2023 జనవరిలోనే 10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటన చేసింది. ఇందులో భాగంగానే తాజా ఉద్వాసనలు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది. అయితే ఎంత మందిని తొలగించేది వెల్లడించలేదు. ఇటీవలే వాషింగ్టన్‌లో 689 మంది ఉద్యోగులకు పింక్‌ స్లిప్‌లు ఇచ్చింది. గత నెలలో వాషింగ్టన్‌లో 617 మందిని ఇంటికి సాగనంపింది. జనవరిలో ఉద్వాసన పలికి 878 మందితో మొత్తం వాషింగ్టన్‌ రాష్ట్రంలోనే 2184 మందిని తొలగించింది. కత్రిమ మేధ (ఎఐ) చేపట్టిన ప్రాజెక్ట్‌ బొన్సారుని సంస్థ మూసివేస్తున్నట్లు ఓ ఉద్యోగి వెల్లడించారు. మరోవైపు 18 ఏళ్ల పైగా పని చేస్తున్న ఓ ప్రిన్సిపల్‌ ప్రొడక్ట్‌ మేనేజర్‌ సహా తనతో పని చేసే మొత్తం గ్రూపు సభ్యులకు ఉద్వాసన పలికింది. ఆర్థిక సంక్షభం భయాలతో టెక్‌ కంపెనీల వరుస పెట్టి ఉద్యోగులను పీకేస్తుండటంతో వారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా వచ్చే వారంలో ఉద్యోగు లకు కోత విధించనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే మెటా నాలుగు నెలల క్రితం 11వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఇది మొత్తం ఉద్యోగుల్లో 13 శాతానికి సమానం. దీంతో రెండో రౌండ్‌లోనూ ఉద్యోగులను తొలగించనున్నట్లయ్యింది.