శాఖహారం 9 శాతం ప్రియం

శాఖహారం 9 శాతం ప్రియం– క్రిసిల్‌ రిపోర్ట్‌
న్యూఢిల్లీ: శాకహారం భోజనం మరింత ఖరీదు అయ్యింది. ఉల్లి, టమోటా, బంగాళ దుంపల రేట్లు పెరిగిపోవడం వల్ల గడిచిన ఏప్రిల్‌లో శాఖహార భోజనం ప్లేట్‌ ‘వెజ్‌ థాలీ’ వ్యయం 9 శాతం పెరిగిందని క్రిసిల్‌ ఎంఅండ్‌ఎ రీసెర్చ్‌ వెల్లడించింది. మరోవైపు చికెన్‌ రేట్లు తగ్గడం వల్ల మాంసహార ప్లేట్‌ ధర దిగివచ్చిందని పేర్కొంది. గతేడాది మేలో మాంసహార థాలీ ధర రూ.59.9గా ఉండగా.. గడిచిన నెలలో రూ.55.9కి తగ్గింది. బ్రాయిలర్‌ చికెన్‌ ధరలు 16 శాతం క్షీణించడంతో నాన్‌ వెజ్‌ థాలీ ధర తగ్గినట్లు నివేదిక తెలిపింది. క్రిసిల్‌ రిపోర్ట్‌ ప్రకారం..
రోటీ, కూరగాయలు, అన్నం, పప్పు, పెరుగు, సలాడ్‌లతో కూడిన వెజ్‌ థాలీ ధర మే నెలలో నెలలో రూ.27.80కి పెరిగింది. గతేడాది ఇదే నెలలో పెరిగిన రూ.25.5తో పోలిస్తే ఎక్కువ. గడిచిన మే నెలలో టమాటా ధరలు 39 శాతం, బంగాళదుంపలు 41 శాతం, ఉల్లి ధరలు 43 శాతం పెరగడమే వెజ్‌థాలీ ధర పెరగుదలకు కారణం. బియ్యం, పప్పుల ధరలు కూడా వరుసగా 13 శాతం, 21 శాతం చొప్పున ఎగిశాయి. జీలకర్ర, మిర్చి, కూరగాయల నూనె ధరలు వరుసగా 37 శాతం, 25 శాతం, 8 శాతం తగ్గడం కొంత ఉపశమనం కలిగిందని నివేదిక పేర్కొంది.