– డబ్ల్యూటీవో నుంచి భారత్ బయటకు రావాలి
– ఎస్కేఎం పోస్టర్ ఆవిష్కరణలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూటీవో) నుంచి భారతదేశం బయటికి రావాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో ట్రాక్టర్లు, వాహనాల ర్యాలీ నిర్వహించనున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం), కార్మిక, ప్రజా సంఘాల నాయకులు ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ర్యాలీ పోస్టర్ను ఎస్కేఎం రాష్ట్ర కన్వీనర్లు టి సాగర్, వి. ప్రభాకర్, పల్లపు ఉపేందర్రెడ్డి, ఆర్.వెంకట్ రాములు, గౌని ఐలయ్య, డేవిడ్ ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ నేడు అబుదాబీలో డబ్య్లూటీవో సదస్సు ప్రారంభం కానున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా క్విట్ ఇండియా డేగా పాటిస్తున్నట్టు తెలిపారు. రైతులకు మినిమం సపోర్ట్ ప్రైస్ (ఎంఎస్పీ) మంజూరు చేయకుండా భారత ప్రభుత్వాన్ని బలవంతం చేయడంతో పాటు సబ్సీడీల ప్రయోజనాలను నేరుగా బదిలీ చేయాలని వాదించడం ద్వారా పీడీఎస్ను ఉపసంహరించుకోవాలని డబ్ల్యూటీవో ఒత్తిడి చేస్తున్నదని ఆరో పించారు. ఈ రెండు ప్రతిపాదనల వల్ల రైతులు, పేద ప్రజలు, ఆహార భద్రత తో పాటు దేశ సార్వభౌమత్వానికి ప్రమాదకరమని హెచ్చరించారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతుల ట్రాక్టర్లను పోలీసులు ధ్వంసం చేసి దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. నిరసనలో మృతి చెందిన వారికి రూ. కోటి నష్ట పరిహారంతో పాటు, ధ్వంసమైన 100 ట్రాక్టర్ల మరమ్మతు ఖర్చులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం దిగి రాకుంటే మార్చి 14న ఛలో ఢిల్లీ కార్య క్రమం నిర్వహిస్తామని ప్రకటించారు.ఈ కార్యక్రమంలో ఎస్కేఎం నాయకులు గోవర్దన్, ఐఎఫ్టీయూ నాయకులు ఎం.శ్రీనివాస్, హన్మేష్, అరుణ, అనురాధ, సీతారామయ్య, శంకర్ డీవైఎఫ్ఐ నాయకులు కోట రమేష్, పీవైఎల్ నాయకులు ప్రదీప్.పీడీఎస్యూ నాయకులు గడ్డం శ్యాం తదితరులు పాల్గొన్నారు.