ఆదర్శ కమ్యూనిస్టు వెంకటయ్య

– గజ్జల ఆశయ సాధన కోసం కృషి చేయాలి
– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ-తిరుమలాయపాలెం
ప్రజల కోసం నిరంతరం పనిచేసిన ఆదర్శ కమ్యూనిస్టు నాయకుడు గజ్జల వెంకటయ్య ఆశయ సాధన కోసం నేటి యువతీ యువకులు కృషి చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు బుగ్గ వీటి సరళ తెలిపారు. అమర జీవి కామ్రేడ్‌ గజ్జల వెంకటయ్య 20వ వర్ధంతి సందర్భంగా ఆయన స్మారక స్థూపం వద్ద, ఆయన చిత్రపటానికి పుష్పగుచ్చాలు వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గజ్జల వెంకటయ్య చిన్నతనం నుండి కమ్యూనిస్టు భావాలు పుణికిపుచ్చుకొని చనిపోయేంతవరకూ ఆయన పార్టీ పూర్తి కాలం కార్యకర్తగా పనిచేస్తూ, మండలంలో పార్టీ విస్తరణ కోసం ఆ రోజుల్లో గ్రామ గ్రామాన చంకలో సంచి వేసుకుని ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటూ ప్రజా ఉద్యమాలు నిర్మించారని గుర్తు చేశారు. ప్రజలకు అండగా ఉంటూ పేదలు, వ్యవసాయ కూలీల కనీస వేతనాల కోసం భూస్వాముల నుండి ఎన్నో ఆటంకాలు అవరోధాలు కల్పించినప్పటికీ మొక్కవోని దీక్షతో పార్టీ పట్ల అంకితభావంతో పని చేశారని కొనియాడారు. కాబట్టి పార్టీ మండల కార్యాలయానికి కామ్రేడ్‌ గజ్జల వెంకటయ్య పేరు పెట్టినారని చెప్పారు. అదేవిధంగా ముఖ్యంగా పిండి ప్రోలు గ్రామ శాఖ గజ్జల వెంకటయ్యను ఆదర్శంగా తీసుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కొమ్ము శ్రీను, సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు పప్పుల ప్రసాద్‌, తిరుమలాయపాలెం సొసైటీ డైరెక్టర్‌ చల్లా వెంకటేశ్వర్లు, గ్రామ శాఖ కార్యదర్శి దొడ్డ లింగస్వామి, పప్పుల ఉపేందర్‌, దొండేటి నిర్మల్‌ రావు, మల్లె బోయిన యాదగిరి, నాగటి సురేష్‌, చామకూరి వీరయ్య, పిడతల ఉపేందర్‌, పల్లిక క్రాంతి కుమార్‌, కిన్నెర వెంకన్న, పప్పుల చిన్న ఉపేందర్‌, పప్పుల అశోక్‌, పప్పుల చందన్‌, గుడివాడ నవీన్‌, గజ్జల వెంకయ్య, కుమార్తెలు అల్లుళ్లు గుడివాడ కమలమ్మ, దర్గయ్య, శ్రీరాముల రమాదేవి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.