టీసాట్‌ సీఈవోగా వేణుగోపాల్‌రెడ్డి

– సీఎంకు మరో ఇద్దరు పీఆర్వోలు
– ఆదేశాలు జారీ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
సీనియర్‌ జర్నలిస్టు బోదనపల్లి వేణుగోపాల్‌రెడ్డిని టీసాట్‌ సీఈవోగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణ స్కిల్‌, ఎకడమిక్‌ అండ్‌ ట్రైనింగ్‌ సాటిలైట్‌ టీవీ అయిన టీసాట్‌ ప్రభుత్వ పర్యవేక్షణలో నడుస్తున్న విషయం తెలిసిందే. జర్నలిజంలో 17 ఏండ్ల అనుభవం ఉన్న వేణుగోపాల్‌రెడ్డి నాగర్‌కర్నూల్‌ జిల్లా ఉప్పునూతల మండలం కొరటికల్‌ గ్రామానికి చెందిన వారు. మాస్‌ కమ్యూనికేషన్‌లో పీజీ చేసిన వేణుగోపాల్‌రెడ్డి విద్యార్థి రాజకీయాల్లోనూ పాల్గొన్నారు. గత మూడేండ్లుగా జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఈనేపథ్యంలో మంగళవారం జీవో నెంబరు ఐదును ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్‌ ఆదేశాలు జారీచేశారు.
సీఎంకు మరో ఇద్దరు పీఆర్వోలు
ఆదిలాబాద్‌కు చెందిన పూండ్రు అన్వేష్‌రెడ్డి సీఎం అదనపు పీఆర్వో(ఏపీఆర్వో)గా నియమితులయ్యారు. మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే సీనియర్‌ జర్నలిస్టు వి. శ్రీనివాసరావును సీఎంకు మరో పీఆర్వోగా ప్రభుత్వం నియమించింది. 20 ఏండ్లుగా వృత్తిలో శ్రీనివాస్‌ ఈటీవీ, మహాన్యూస్‌, బిగ్‌టీవీతోపాటు పలు మీడియా సంస్థల్లో పనిచేశారు. శ్రీనివాస్‌ నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఊట్లపల్లికి చెందినవారు.