24 నుంచి ఉపాధ్యాయుల సర్టిఫికట్ల వెరిఫికేషన్‌

– బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
గురుకుల ఉపాధ్యాయ నియామక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఎంజేపీ బీసీ గురుకులాల్లో నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులు ఈనెల 24 నుంచి నిర్వహించే సర్టిఫికేషన్‌ వెరిఫికేషన్‌కు హాజరు కావాలని మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ధృవపత్రాల పరిశీలన కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 10లో సంత్‌ సేవాలాల్‌ బంజారా భవన్‌లో ఈనెల 30 వరకు ఉదయం పది గంటల నుంచి నిర్వహించనున్నట్టు తెలిపారు. నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. 24న లైబ్రేరియన్‌( స్కూల్‌, జూనియర్‌ కాలేజీ, డిగ్రీ కాలేజీ), ఫిజికల్‌ డైరెక్టర్‌, (జూనియర్‌ కాలేజీ, డిగ్రీ కాలేజీ), డిగ్రీ లెక్చరర్స్‌ అభ్యర్థులు హాజరు కావాలనీ, 25న జూనియర్‌ లెక్చరర్‌ (ఇంగ్లీష్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, సివిక్స్‌, ఎకనామిక్స్‌, కామర్స్‌, హిస్టరీ) , 26న జూనియర్‌ లెక్చరర్‌ (హిందీ, తెలుగు, గణితం), పీజీటీ (తెలుగు, హిందీ), 27న పీజీటీ (ఇంగ్లీష్‌, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, బయాలజీ, సోషల్‌) ఫిజికల్‌ డైరెక్టర్‌ గ్రేడ్‌-××, 28న టీజీటీ (హిందీ, బయోలాజికల్‌ సైన్స్‌, సోషల్‌) 29న టీజీటీ (ఇంగ్లీష్‌ , ఫిజికల్‌ సైన్స్‌) 30న టీజీటీ (తెలుగు , గణితం) అభ్యర్థులు హాజరు కావాలని తెలిపారు. ఆయా పోస్టులకు సంబంధించిన అభ్యర్థులు షెడ్యూల్‌లో ఇచ్చిన తేదీల వారీగా తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్స్‌తో హాజరు కావాలని సూచించారు. వారందరికీ మెసేజ్‌లు పంపించామని తెలిపారు.