– మోడీది అవినీతి పాఠశాల
– ‘జైలు -బెయిలు” అనే గేమ్ను ఎలా ఆడాలో నేర్పిస్తారు : రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: ప్రధాని మోడీ దేశంలో అవినీతి పాఠశాలను నడుపుతున్నారని, ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే ఆ పాఠశాలకు లాక్ పడుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ నేతలకు అవినీతి పాఠాలను ఆయన చక్కగా బోధిస్తున్నారని ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా వ్యాఖ్యానించారు. ”ఈ స్కూల్లో ‘డొనేషన్ బిజినెస్’ అనే కోర్స్లోని ప్రతీ అధ్యాయాన్ని స్వయంగా ఆయనే బోధిస్తున్నారు. ధనాన్ని కూడా వ్యాపారంగా ఎలా మార్చాలో మోడీ వివరిస్తారు. సోదాలు నిర్వహించి విరాళాలు ఎలా సేకరించాలి? విరాళాలు తీసుకున్న అనంతరం ఒప్పందాల పంపిణీ ఎలా చేయాలి? అనే అంశాలనూ వివరిస్తారు” అని రాహుల్ ఆరోపించారు. అయితే, కాషాయ పార్టీలోని ప్రతి నేతకూ బీజేపీ ఈ కోర్సు తప్పనిసరి చేసిందన్నారు. అవినీతిపరుల నేర మరకలను వాషింగ్ మెషీన్లా కడిగేస్తోందంటూ బీజేపీని ఉద్దేశిస్తూ విమర్శలు గుప్పించారు. ఏజెన్సీలను రికవరీ ఏజెంట్లుగా మార్చి ‘బెయిల్’, ‘జైలు’ అనే గేమ్ను ఎలా ఆడాలో వివరించగలదన్నారు. అవినీతికి బీజేపీ నిలయంగా మారిందని విమర్శించారు.