అవినీతి కేసులో దోషిగా వియత్నాం రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజం

హనోయ్ : వియత్నాం రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజం ట్రాంగ్‌ మై లాన్‌ కోట్లాది రూపాయిల మేరకు అవినీతికి పాల్పడిన కేసులో దోషిగా తేలారు. అవినీతిపై ప్రభుత్వ అణచివేత చర్యల్లో భాగంగా ఈ కేసు తెరపైకి వచ్చింది. మరో కేసులో 12,500కోట్ల డాలర్ల మేరకు అవినీతి చర్యలు చేపట్టినందుకు హోచిమిన్‌ నగర కోర్టు ఇప్పటికే ట్రాంగ్‌ మై లాన్‌ను ఏప్రిల్‌లో దోషిగా నిర్ధారించింది. ఈ మొత్తం దేశ స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 3శాతంగా వుంది. ఈ కేసులో మరణ శిక్ష విధించారు. ఆమెపై అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో విచారణలను రెండు భాగాలుగా చేశారు. గురువారం ఇచ్చిన తీర్పు కింద గరిష్ట కాలం జైలు శిక్ష అనుభవించాల్సి వుంది. కాగా తన మరణశిక్ష తీర్పునకు వ్యతిరేకంగా అప్పీల్‌ చేసిన ఆమె తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు. తన కెరీర్‌లో ఇదొక యాక్సిడెంట్‌ అని ఆమె వ్యాఖ్యానించినట్లు ఆన్‌లైన్‌ వార్తాపత్రిక విఎన్‌ఎక్స్‌ప్రెస్‌ వ్యాఖ్యానించింది. తన చర్యల వల్ల వేలాది కుటుంబాలు ప్రభావితమయ్యాయన్న విషయం మర్చిపోనని ఆమె వ్యాఖ్యానించారు. ఈ కేసులో మరో 33మందిని కూడా విచారించారు. కానీ వారి తీర్పుల వివరాలు వెంటనే తెలియరాలేదు.