జిల్లాలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టాలి: ఎన్నికల అధికారి

– సీజింగ్ వాటికి రసీదు అందించాలి.
– జిల్లా ఎన్నికల అధికారి ఎస్ వెంకట్రావు.
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో  చెక్ పోస్టుల్లో ముమ్మర తనిఖీలు చేపట్టాలని  జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావ్  అధికారులను ఆదేశించారు. జిల్లా అంతట ఏర్పాటు చేసిన అన్ని చెక్ పోస్ట్ లలో  గట్టి నిఘా పెంచాలని అన్నారు.  బుధవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా ఇంటెలిజెన్స్ కమిటీ సమావేశం లో  జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్. లత, అదనపు యస్.పి. నాగేశ్వరవుతో కలిసి పాల్గొన్నారు.
 ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బ్యాంకర్లు డిజిటల్ లావాదేవీలు  అలాగే బ్యాంక్ లావాదేవీలు రూ. 5 లక్షల నుండి 10 లక్షల వరకు జరిగే వాటిపై అలాగే పోస్టల్ శాఖ ద్వారా జరిగే లావాదేవీలపై గట్టి నిఘా ఉంచాలని  అన్నారు.  రోజువారీ నివేదికలు ఎప్పటికప్పుడు అందజేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎఫ్. ఎస్. టి,  ఎస్.ఎస్.టి టీములు నిరంతరం  ముమ్మర తనిఖీలు చేయాలని అన్నారు. చెక్ పోస్టుల  వద్ద తనిఖీలు స్వాధీనం చేసుకున్న వాటికి తప్పకుండా రసీదు అందజేయాలని అలాగే బాధితులు ఇబ్బందులు పడకుండా ఆధారాలు చూపితే అందచేయాలని కలెక్టర్ సూచించారు. ఎక్సైజ్ శాఖ టీమ్స్  అక్రమ మద్యం సిజింగ్ చేయుటకు తనిఖీలు ముమ్మరం చేయాలని  అన్నారు.  లిక్కర్ తో పాటు ఇతర మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకోవాలని అన్నారు. ముఖ్యంగా జిల్లాలో నల్ల  బెల్లం,  బేల్టు షాపుల నిర్వహణ కట్టడి చేయాలని సూచించారు.  జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు.  రెవెన్యూ,  పోలీస్ ,ఎక్సైజ్ శాఖ  సమన్వయంతో కలసి పని చేయాలని సూచించారు.పట్టుకున్న అక్రమ నగదు, మద్యం, బంగారం, వెండి, ఇతర వస్తువులకు  బాధితులు ఆధారాలు చూపితే గ్రీవెన్స్ కమిటీ  పరిశీలన తదుపరి 24 గంటల లోపు అందచేస్తున్నామని తెలిపారు. జిల్లాలో 32 బృందాలు విధుల్లో ఉన్నారని , జిల్లా అంతటా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్  అమలులో ఉందని ప్రజలు పూర్తిగా సహకరించాలని అన్నారు. జిల్లాలో  ఇప్పటివరకు నగదు రూ.134.11 లక్షలు, మద్యం 8413.75  లీటర్ల విలువ రూ. 33.39  లక్షలు, పది వాహనాల విలువ రూ.2.32 లక్షలు, బంగారం, ఇతర ఆభరణాల విలువ రూ. 113.63 లక్షలు ఇతర వస్తువుల విలువ రూ. 70.28 లక్షలు మొత్తం 353.73 లక్షలు ఉంటుందని కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన కంట్రొల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ అప్పారావు, ఎక్సైజ్ పర్యవేక్షకులు లక్ష్మనాయక్  ,డి ఎఫ్ ఓ సతీష్ కుమార్,ఇన్కమ్ టాక్స్ అధికారి, డిసిఓ పద్మ, లీడ్ బ్యాంకు మేనేజర్ బాపూజీ, ఎలక్షన్ విభాగం పర్యవేక్షకులు  శ్రీనివాసరాజు ఎన్నికల సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.