
– రౌండ్ల వారిగా ఫలితాలను వెల్లడించేందుకు ఏఆర్వోలను నియమించాలి
– రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
జూన్ 4వ తేదీ నిర్వహించనున్న పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా అన్ని జిల్లాలలో ఏర్పాట్లను జూన్ 1 లోపే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు పై మంగళవారం ఆయన హైదరాబాద్ నుండి అదనపు సీఈవోలు సర్ఫ రాజ్ అహ్మద్, లోకేష్ కుమార్, డిప్యూటీ సిఈఓ,పోలీస్ అధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలలో జిల్లా ఎన్నికల అధికారి తో పాటు, ఒక ఇన్చార్జి అధికారిని నియమించాలని, గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని, గుర్తించిన వారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించాలని, ఇందుకు సరైన విధంగా తనికి చేయాలని, కౌంటింగ్ కేంద్రంలోకి ఎలాంటి రికార్డెడ్ డివైస్ లను అనుమతించవద్దని, మీడియాకు మీడియా కేంద్రంలో ఎప్పటికప్పుడు రౌండ్ల వారిగా ఫలితాలు వెల్లడి చేసేలా అదనపు ఏఆర్వోలను నియమించాలని, మీడియాతో పాటు ప్రజలకు తెలిసే విధంగా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయాలని, వివిధ రకాల ఫారాలను సమర్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు.అంతకుముందు అదనపు. సీఈ ఓ లు ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఏర్పాటు చేయనున్న టేబుల్లు, రౌండ్లు, పోస్టల్ బ్యాలెట్, లెక్కింపు కేంద్రంలోకి అనుమతించేవారు, సీసీటీవీలు, రిపోర్టు లు, డిస్ ప్లే తదిత అంశాలపై సూచనలు చేశారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా నుండి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన, జిల్లా ఎస్పీ చందనా దీప్తి, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, డిఆర్ఓ డి. రాజ్యలక్ష్మి, ఆర్డిఓ రవి, డిఎస్పి శివరాం రెడ్డి ఇతర అధికారులు, తదితరులు హాజరయ్యారు.