జిల్లాల్లో పర్యటించి నివేదిక సమర్పించాలి

– డెంగ్యూ కట్టడిపై మంత్రి దామోదర ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
డెంగ్యూ కట్టడిపై జిల్లాల్లో పర్యటించి నివేదిక సమర్పించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఉన్నతాధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఆయన సీజనల్‌ వ్యాధుల కట్టడిపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. డీహెచ్‌ ఆధ్వర్యంలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేయాలనీ, ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల సమన్వయంతో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని ఆదేశించారు. బాధితులకు సరైన వైద్యం అందించేలా కంట్రోల్‌ రూం నుంచి పర్యవేక్షించాలని సూచించారు. ఈ సమావేశంలో వైద్యారోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్‌ క్రిస్టీనా జెడ్‌ చొంగ్తూ తదితరులు పాల్గొన్నారు.