మంత్రి హరీష్‌ రావు చొరవతో సిద్ధిపేటలో వృత్తి నైపుణ్య కేంద్రం

– రూ .10 కోట్లతో న్యాక్‌ భవనం నిర్మాణం
నవ తెలంగాణ- సిద్దిపేట
నిర్మాణ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఆసక్తి చూపే ఉమ్మడి మెదక్‌ జిల్లా వాసులకు మంత్రి హరీష్‌ రావు తీపి కబురు చెప్పారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా నిర్మాణ రంగ నిరుద్యోగులకు మంత్రి హరీశ్‌ రావు అండగా మారారు. వృత్తి నైపుణ్యం కోసం హైదరాబాదులో ఉన్న న్యాక్‌- నిర్మాణ రంగంలో మెళుకువలు నేర్పిస్తారు. జాతీయ శిక్షణా కేంద్రం అనుబంధంగా జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో ఇప్పటికే న్యాక్‌ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. నిర్మాణ రంగంలో అపారమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా ఇందు కోసం యువత శిక్షణ కోసం హైదరాబాదులోని హైటెక్‌ సిటీలో ఉన్న న్యాక్‌ వరకు వెళ్ళకుండా సిద్ధిపేటలోనే ఏర్పాటు చేయడం ఊరట కలిగించిన అంశం. శిక్షణ కేంద్రం ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ చూపిన మంత్రి ఇందుకు అవసరమైన వత్తి నైపుణ్య కేంద్ర నిర్మాణం కోసం ఇటీవలే రూ.10 కోట్లు నిధులు మంజూరు చేశారు. కాగా మంత్రి హరీశ్‌రావు న్యాక్‌ భవనానికి బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. జి ప్లస్‌ 2 గా దీని నిర్మాణం జరగనుంది. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో హల్‌, ఫస్ట్‌ ఫ్లోర్‌ లో డైనింగ్‌ హల్‌, టాయిలెట్స్‌ , రెండవ అంతస్థులో క్లాస్‌ రూమ్స్‌, శిక్షణార్థులకు వసతి గహం ఏర్పాటు కానుంది. రాష్ట్రంలోనే మోడల్‌గా న్యాక్‌ భవనం నిర్మాణం కానుంది. నిర్మాణ రంగ నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ, స్వాగతిస్తున్నారు. ఈ భవనం పూర్తయితే నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్స్ట్రక్షన్స్‌-న్యాక్‌ సెంటరులో లార్సన్‌ అండ్‌ టూబ్రో ఎల్‌ అండ్‌ టీ సంస్థ ప్రతియేటా 300 మంది నిర్మాణ రంగ కార్మికులకు శిక్షణ ఇవ్వనున్నారు.