– మూడు గ్రామాల ప్రజలకు అస్వస్థత
– ఒకరు మృతి, మిగతా వారికి చికిత్స
– బాధితుల్లో ఎక్కువమంది కల్లు సేవించిన వారే..
నవతెలంగాణ-దుబ్బాక
వాంతులు, విరోచనాలతో మూడు గ్రామాల ప్రజలు అస్వస్థతకు గురైన సంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో శుక్రవారం జరిగింది. దుబ్బాక మండలం బల్వంతాపూర్, పద్మశాలి గడ్డ, నర్లెంగడ్డ, దుబ్బాక పురపాలిక పరిధిలోని దుంపలపల్లి వార్డుకు చెందిన సుమారు 60 మంది గురువారం తీవ్ర వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్లో రైతులు, వ్యవసాయ కూలీలు, ఇతర పనులు చేసుకునే వారు ఉన్నారు. కల్లు సేవించే అలవాటున్న వీరంతా ఎప్పటిలాగే గురువారమూ కల్లు సేవించారు. కొద్దిసేపటి తర్వాత కడుపు నొప్పితో వాంతులు, విరోచనాలకు గురయ్యారు. వెంటనే వారిని చికిత్స కోసం దుబ్బాక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి, మరో రెండు ప్రయివేటు ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పద్మశాలిగడ్డకు చెందిన సుంగూరి కుంటయ్య మృతి చెందారు. కొందరు నల్లా నీరు తాగడం, మరికొందరు చేపలు తినడం, కల్లు సేవించడంతో అస్వస్థతకు గురైనట్టు బాధితులు చెబుతున్నారు. సీరియస్గా ఉన్న 8 మందిని సిద్దిపేటలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్కు తరలించారు. మిగతా వారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మెరుగైన వైద్యం అందిస్తున్నట్టు ఏరియా ఆస్పత్రి వైద్యులు తెలిపారు. బాధితుల రక్త, మూత్ర నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపామని, రెండు రోజుల్లో ఫలితాలు వస్తాయని వైద్యులు తెలిపారు. కాగా, బల్వంతాపూర్, పద్మశాలిగడ్డ, నర్లెంగడ్డ, దుంపలపల్లి గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి స్థానికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అస్వస్థతకు గురై మరణించిన పద్మశాలిగడ్డకు చెందిన సుంగూరి కుంటయ్య కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు, ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి, జెడ్పీటీసీ కడ్తాల రవీందర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనిత భూమిరెడ్డి, వైస్ చైర్పర్సన్ అధికం సుగుణ బాలకిషన్ గౌడ్, కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి, కౌన్సిలర్లు పరామర్శించారు.