ఓటు తలరాతని మారుస్తుంది. మన ప్రజాస్వామ్యంలో ఓటుకున్న విలువ చాలా గొప్పది. కానీ ఓటర్లు ఆయా రాజకీయ నాయకులు, పార్టీల ప్రలోభాలకు లోనై ఓటును అమ్ముకునే దుస్థితికి చేరుకున్నారు.ఓటుకి నోటు, నోటుకు కోటు అనే విధంగా రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తూ ఓటర్లను కొంటూ ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో మాత్రమే భావస్వేచ్ఛకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు,యువత, విద్యాధికులు ఓటు హక్కును వినియోగించుకోవాలి. అధికశాతం గ్రామీణ ప్రాంత ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించు కుంటున్నారని, పట్టణ ప్రాంత ప్రజలు, యువత ఓటు హక్కును వినియోగించుకోవడం లేదు. ఎప్పుడెన్నికలు జరిగినా పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల ఓటు శాతం తగ్గుతూ వుంది. మేధావులు దూరంగా ఉంటున్నారు. మనదేశంలో ఓటు వేయని వారు 40 శాతం ఉన్నారని, అది సున్నాకు రావాల్సిన అవసరం ఉంది. న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల కంటే శక్తివంతమైన పాత్ర శాసనాలు తయారు చేసే పార్లమెంట్, అసెంబ్లీలది. ఉన్నత విలువలతో కూడిన ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినది రాజకీయ నేతలే. అలాంటి నేతలను ఎన్నుకొనేది ఓటర్లే. అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ ప్రజా స్వామ్యం గొప్పతనాన్ని వివరిస్తూ ప్రజాస్వామ్యం అంటే ‘ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజలే ఎన్నుకొనే విధానం’ అన్నారు. ప్రజాస్వామ్యం అనేది ఒక రాజకీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియ. ఇందులో ప్రజలు లేదా ఓటర్లు వేసే ఓటు వల్ల ఆ ప్రభుత్వాన్ని నిర్ణయిస్తారు.1950 జనవరి 25న భారత ఎన్నికల సంఘం ఏర్పాటైంది. కేంద్ర ఎన్నికల సంఘం తొలిసారి జాతీయ ఓటర్ల దినో త్సవాన్ని 2011 జనవరి 25వ తేదీ నుండి నిర్వ హిస్తోంది. 18 ఏళ్లు నిండిన యువతకు కొత్త ఓటు కల్పించడం, ఓటు సవరణ, ఓటు విలువ తెలియ చేయడం, ఓటు ప్రాముఖ్యతను చెప్పేలా ఎన్నికల సంఘం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది.
2011 జనవరి 25రోజున అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగిన భారత కేంద్రమంత్రి మండలి సమావేశంలో ఈ చట్టం అమలుకు ఆమోదం లభించింది.ఓటు అనే రెండ క్షరాల పదం దేశ చరిత్రనే మార్చే’స్తుంది. కేంద్రప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే బేధం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటుహక్కును కల్పిస్తున్నది. ఓట్లు వేసే అభ్యర్థులను ఓటర్లు అని పిలుస్తారు. దేశ అభివృóద్ధికోసం నాయకులను ఎన్నుకోవడానికి ఓటు అనేది ఒక వజ్రా యుధం. భారత పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కు పాలకులను ఎన్నుకోవడమే ఓటు ముఖ్య ఉద్దేశం. ఓటు హక్కును సుమారు 20 నుంచి 30 శాతం ప్రజలు ప్రతి ఎన్నికల్లోనూ సద్వినియోగం చేసుకోవడం లేదు. ప్రధాన కారణం ఓటు ప్రాము ఖ్యత, విలువ తెలియకపోవడం.సరైన అవగాహన లేకపోవడం, నూరుశాతం పోలింగ్ సాధించే దిశగా ఎన్నికల సంఘం ఓటు ప్రాముఖ్యత, నమోదుపై ప్రతి సంవత్సరం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఓటుపై చైతన్యం తీసుకురావడం, యువతను ఓటు నమోదుకు ప్రోత్సహించేందుకు ప్రయత్నం చేస్తోంది. మంచి పాలకులను ఎన్ను కోవడానికి ఓటు అనేది ప్రజలకు అస్త్రం. ఎన్నికైన ప్రజాప్రతినిధులపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని దేశాభివృద్ధికి సేవాభావం ఉన్న ప్రజాప్రతినిధులను స్వేచ్ఛగా, ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటు ద్వారా ఎన్నుకోవాలన్నది ఎన్నికల సంఘం ముఖ్యఉద్దేశం.
ప్రజలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం, గౌరవం ఉన్నాయి.ప్రజాస్వామ్యం ఎన్నికలపైనే ఆధారపడి ఉంటుంది. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఎన్నికల సంఘం కీలకపాత్ర పోషిస్తున్నది. ఏ రాజకీయ పార్టీకి తలవంచక స్వతంత్రంగా తన విధులను నిర్వర్తిస్తుంది. కేంద్రస్థాయిలో భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ఎన్నికల సంఘాలు విధులను సమర్ధంగా నిర్వహిస్తున్నాయి. ప్రజా స్వామ్యం మనుగడ ఓటరుపై ఆధారపడి ఉన్నందున ఓటర్కు ప్రాధాన్యత పెరిగింది. రాజకీయ వ్యవస్థ పారదర్శకంగా ఉండాలనే లక్ష్యం తో యువతను భాగస్వాములు చేయాలని ఓటు ప్రాముఖ్యతను వివరించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించాలని నిర ్ణయించింది. కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి గుర్తింపు కార్డులు అందిస్తుంది. ఓటు ప్రాముఖ్యత, కొత్త ఓటు నమోదు, చేర్పులు, మార్పులకు అవకాశం కల్పిస్తూ ఎన్నికల సంఘం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తూ, అవ గాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంది. ప్రజా స్వామ్యంలో ఓటు హక్కుతోనే వార్డు సభ్యుల నుంచి రాష్ట్రపతి వరకు అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఓటు హక్కు మన జన్మ హక్కు కావాలి.ఓటు వేయ డం మన భాధ్యత.ఓటు హక్కుని వినియోగించు కుందాం.ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం.
– కామిడి సతీష్రెడ్డి, 9848445134.
(జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం)