వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఓటరు జాబితా తయారు చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సూచించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నుండి అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ సంచిత్ గంగ్వార్తో కలిసి తహసీల్దార్లతో ఓటరు జాబితా రూపకల్పనపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై, 13 నాటికి డబల్ ఓటర్లు, చనిపోయిన వారు లేని ఓటర్ జాబితాను సిద్ధం చేయాలన్నారు. ఇందుకు గాను ప్రతివారం పొలిటికల్ పార్టీల ప్రతినిధులతో తప్పనిసరిగా సమావేశాలు నిర్వహించాలన్నారు. జిల్లా స్థాయి నుండి మండల స్థాయి వరకు వివిధ పార్టీల ప్రతినిధుల అన్ని వివరాలు అందుబాటులో ఉంచాలన్నారు. బీఎల్ఓ లు, సూపర్వైజర్లు అందరూ విధులలో చురుకుగా పనిచేసేలా చూసుకోవాలని సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో బిఎల్ఓలు పనిచేయాలని, ఖాళీలు ఏర్పడితే వెంటనే భర్తీ చేసుకోవాలని అన్నారు. బీఎల్ఓల ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రతి తహసీిల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్లను ఎన్నికల విధుల నిర్వహణకు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించి రెండు రోజులలో పూర్తి చేయాలని, ఈఆర్ఓ ఆన్లైన్ సేవలు జూలై 13 వరకు మాత్రమే పనిచేస్తుందని, ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు అన్నింటిని క్షేత్రస్థాయిలో పరిశీలించుకొని పనులు పూర్తి చేసుకోవాలని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని గుర్తించి ఓటరుగా నమోదు చేయాలని ఆదేశించారు. ఈసారి ఎన్నికలలో (హౌమ్ ఓటింగ్) ఇంటి దగ్గర నుండి ఓటింగ్ నిర్వహించనున్నట్టు తెలుపుతూ 80 సంవత్సరాలు పైబడిన వారు, 40 శాతం కన్నా ఎక్కువ అంగవైకల్యం గలవారికి వారి ఇంటి వద్ద నుండే ఓటింగ్ చేసుకొనే విధంగా సదుపాయం కల్పించనున్నట్టు కలెక్టర్ తెలియజేశారు. బీఎల్ఓలు ఇలాంటి వారి ఇండ్లకు వెళ్లి వారి ద్వారా ఫామ్-8లో దరఖాస్తు చేయించాలన్నారు. రాబోవు ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అందరూ పూర్తి బాధ్యతతో పని చేయాలని ఆదేశించారు.