చిరంజీవి నటించిన మాస్-యాక్షన్ ఎంటర్టైనర్ ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకుడు. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈనెల 11న విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. నిర్మాతలు అల్లు అరవింద్, టీజీ విశ్వప్రసాద్, ఏఎం రత్నం, దర్శకులు గోపీచంద్ మలినేని, బాబీ, వంశీ పైడిపల్లి, సంపత్ నంది, బుచ్చిబాబు సాన తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ,”ఖైదీ నెంబర్ 150’లో నాకు నచ్చితేనే చేస్తాను, నాకు నచ్చితేనే చూస్తాను’ అనే డైలాగ్ ఉంది. ‘భోళా శంకర్’ నాకు నచ్చింది కాబట్టే చేశాను. నాకు నచ్చింది కాబట్టే చూశాను. అంతగా నచ్చిన సినిమా మీ అందరితోనూ మార్కులు వేయించుకుంటుందనే ధైర్యంతోనే ఈనెల 11న సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ సినిమా చిత్రీకరణ చాలా ఉత్సాహంగా గడిచింది. ఇంత ఉత్సాహం ఎందుకంటే.. ఈ సినిమా ఆల్రెడీ మా మనసుల్లో సూపర్ హిట్ అయిపోయిందనే ఫీలింగ్ వచ్చేసింది. మెహర్ రమేష్ ఈ సినిమాకి పూర్తి స్థాయి న్యాయం చేశాడు. మణిశర్మ అబ్బాయి మహతి స్వరసాగర్ అద్భుతమైన సంగీతం అందించాడు. అన్ని రకాల పాటలు ఇచ్చారు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటాడు. నిర్మాత అనిల్ సుంకరకి సినిమా అంటే ప్యాషన్. ఆయనకికి డబ్బు కంటే విజయం ముఖ్యం. ‘వాల్తేరు వీరయ్య’కు మించిన హిట్ అవుతుందని ఆకాంక్షిస్తున్నాను’ అని అన్నారు.
‘ఒక గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు ఎలా ఉంటుందో ఈ జనరేష్కి అలా ఉండేలా ఈ సినిమా ఉంటుంది’ అని దర్శకుడు మెహర్ రమేష్ అన్నారు. నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ,’ చిరంజీవితో సినిమా చేయాలనేది నా కల. అది ఈ సినిమాతో తీరింది. ఈనెల 11న అభిమానులకు గిఫ్ట్ ఇస్తున్నాం’ అని చెప్పారు.