పర్యావరణహితంలో మనమే నెం1

– సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌(సీఎస్‌ఈ) నివేదికలో మొదటి స్థానంలో తెలంగాణ
– ప్రభుత్వ సమగ్ర, సమతుల్య పర్యావరణ విధానాలకు దక్కిన గుర్తింపు : మంత్రి కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్రం మరోసారి దేశానికి ఆదర్శంగా నిలిచింది. దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్న వేళ మరో అరుదైన ఘనతను దక్కించుకుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ సంస్థ సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌(సీఎస్‌ఈ) విడుదల చేసిన నివేదికలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. ప్రభుత్వం చేపట్టిన అడవుల పెంపకం, మున్సిపల్‌ వేస్ట్‌మేనేజ్‌మెంట్‌ వంటి అనేక పర్యావరణహిత కార్యక్రమాలను పరిగణలోకి తీసుకున్న సంస్థ, రాష్ట్రానికి అగ్రస్థానాన్ని కట్టబెట్టింది. జాతీయస్థాయిలో పర్యావరణ రంగంలో ఈ గొప్ప గుర్తింపు లభించడం పట్ల మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. పచ్చదనంతో పరిఢవిల్లాలన్న బృహత్‌ సంకల్పంతో సీఎం కేసీఆర్‌ ప్రారంభించిన తన మానస పుత్రిక హరితహారం కార్యక్రమంతో పాటు అనేక పర్యావణహితమైన కార్యక్రమాలకు ఈ అరుదైన ఘనత దక్కడం సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హరితహారంతోపాటు ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతమయ్యేలా భాగస్వాములైన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంత్రి కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం తనదైన విధానాలతో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని, పర్యావరణం విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల ఫలితమే తెలంగాణ దేశంలో అగ్రస్దానంలో నిలిచేందుకు కారణమని అన్నారు. పర్యావరణ విధ్వంసం నుంచి తెలంగాణ ప్రాంతం కోలుకునేలా తోలినాళ్లలోనే కేసీఆర్‌ దీర్ఘదృష్టితో ఈ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి, దాని అమలుకి చూపిన చంచలమైన కృషి వల్లనే ఈ ఘనత సాధ్యమైందన్నారు. భవిష్యత్తు తరాల కోసం హరించుకుపోయిన అడవులను పునరుద్ధరించి, రాష్ట్రంలో పచ్చదనాన్ని 22 శాతం నుంచి 33 శాతానికి పెంచడం లక్ష్యంగా హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని, ప్రజల సహకారంతో ఇది ఒక ఉద్యమ రూపంలో కొనసాగిందన్నారు. అనేక సానుకూల ఫలితాలు అందుతున్న విషయాన్ని అనేక సంస్థలు పలుమార్లు గుర్తించిన విషయాన్ని కేటీఆర్‌ ప్రస్తావించారు.
హరితహారంతో పాటు ప్రభుత్వం పర్యావరణహితమైన అనేక కార్యక్రమాలను చేపట్టిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో పర్యావరణానికి అత్యంత సవాలుగా నిలిచే పారిశుద్ధ్య నిర్వహణ విషయంలోనూ అద్భుతమైన ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపల్‌ కార్పొరేషన్లతోపాటు పలు పురపాలికల్లో పేరుకుపోయిన చెత్తను బయో మైనింగ్‌ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. హైదరాబాద్‌ నగరంలో వేస్ట్‌ టు ఎనర్జీ రంగంలో 24 మెగావాట్ల విద్యుత్తుని ఉత్పత్తి చేస్తూ దేశంలోనే రెండోస్ధానంలో నిలిచిందన్నారు. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ద్వారా విద్యుదుత్పత్తి చేయడంలోనూ తెలంగాణ అగ్రగామిగా నిలుస్తున్నదన్నారు.
ప్రభుత్వ ప్రయత్నాలకు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, అవార్డులు, ప్రశంసలు రావడం మరింత తమకు స్ఫూర్తిని ఇస్తుందని కేటీఆర్‌ అన్నారు. ఈ మధ్యనే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న బృహత్‌ ప్రకృతి వనాలు, దేశానికే ఆదర్శం అంటూ నిటి అయోగ్‌ ప్రత్యేక ప్రశంసలు ఇవ్వడాన్ని కూడా కేటీఆర్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. భవిష్యత్తు తరాలకు పర్యావరణహిత రాష్ట్రాన్ని అందించాలన్న లక్ష్యం కోసం తమ తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదన్నారు.