అభివృద్ధిలో మనమే ఆదర్శం

We are the ideal in development– ఇంజినీర్స్‌ డేలో విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రాభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అనీ, కేవలం 9 ఏండ్లలోనే ఈ విజయాన్ని సాధించగలిగామని చెప్పారు. తెలంగాణ స్టేట్‌ పవర్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 163వ జన్మదినాన్ని పురస్కరించుకొని 56వ ఇంజనీర్స్‌ డే ని శుక్రవారంనాడిక్కడి టీఎస్‌జెన్‌కో శక్తి బిల్డింగ్‌ ఆడిటోరియంలో నిర్వహించారు. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ సీఎమ్‌డీలు జీ రఘుమారెడ్డి, ఏ గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. విద్యుత్‌ ఒక్కటే కాకుండా అన్ని జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలు, గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి, దేశానికి ఆదర్శంగా ఉన్నామన్నారు. ఈ ప్రగతి సీఎం కేసీఆర్‌ దూరదృష్ట వల్లే సాధ్యమైందని చెప్పారు. సీఎమ్‌డీలు మాట్లాడుతూ ఉద్యోగుల్లోని నిబద్ధత, క్రమశిక్షణమే రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నిలిపిందని అన్నారు. కార్యక్రమంలో టీఎస్‌పీఈఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సదానందం, పీ రత్నాకరరావు, ఉపాధ్యక్షులు వెంకట్‌ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.