నేతన్నల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం: కలెక్టర్

– నేత పరిశ్రమ యజమానులు, ఆసాములు, కార్మికులతో సమావేశంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
నవతెలంగాణ – సిరిసిల్ల
జిల్లాలోని నేతన్నల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని  కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. సిరిసిల్ల పవర్ లూం సమస్యలపై చర్చించేందుకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం లో పరిశ్రమ యజమానులు, ఆసాములు, కార్మికులతో శనివారం సమావేశం చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై పరిశ్రమలో నెలకొన్న సమస్యలు, కార్మికులకు ఉపాధి, భవిషత్ కార్యాచరణ పై కాటన్, పాలిస్టర్, సైజింగ్, కార్మిక సంఘాల నాయకుల అభిప్రాయాలు తీసుకున్నారు. పవర్లూమ్ పరిశ్రమకు విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలని, పాత  బకాయిలు మాఫీ చేయాలని, బతుకమ్మ చీరల బకాయిలు విడుదల చేయాలని, కామన్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని, క్లాత్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాలని, యువతకు ఆధునిక టెక్నాలజీ పై శిక్షణ ఇప్పించాలని, సబ్సిడీ పై ఆధునిక పవర్ లూం యంత్రాలు ఇవ్వాలని, యారన్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని, బకాయి ఉన్న విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని, నూతన క్లాత్ ఉత్పత్తుల ఆర్డర్లు ప్రభుత్వం ఇవ్వాలని వారు కోరారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. నేత కార్మికుల సమస్యలపై చర్చించిన అంశాలు అన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, పరిశ్రమలో వచ్చిన సమస్యలు పరిష్కరిస్తామని, త్వరలో మరో సమావేశం ఏర్పాటు చేసి భవిషత్ కార్యాచరణ నిర్ణయిస్తామని తెలిపారు. పరిశ్రమను యథావిథిగా కొనసాగించాలని కోరారు.
ఈ సమావేశంలో చేనేత జౌళి శాఖ ఆర్ డీడీ రాఘవరావు, ఏడీ సాగర్, పరిశ్రమ యజమానులు, ఆసాములు, కార్మికులు,  తదితరులు పాల్గొన్నారు.