– రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు : సీఎం రేవంత్రెడ్డి
– ప్రతి ఇంటా వెలుగులు నింపుతాం
– అందరి సహకారంతో రాష్ట్రాభివృద్ధి
– రైతు, మహిళ, యువ నామ సంవత్సరంగా కొత్త ఏడాది
– అమరులు, ఉద్యమకారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్.
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొత్త ఏడాదిని రైతు, మహిళ, యువత నామ సంవత్సరంగా సంకల్పం తీసుకున్నట్టు ప్రకటించారు. ”అందరి సహకారంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. నిర్బంధాలు, ఇనుప కంచెలను తొలగించాం. పాలనలో ప్రజలను భాగస్వాములను చేశాం. ప్రజాస్వామ్య పునరుద్ధరణ, పౌరులకు స్వేచ్ఛ ఉంటుందన్న హామీని నిలబెట్టుకున్నాం. ఆరింటిలో రెండు గ్యారెంటీలు అమలు చేశాం. కొత్త ఏడాదిలో మిగతా గ్యారెంటీల అమలుకు సిద్ధంగా ఉన్నాం. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందాలి. అభివద్ధిలో రాష్ట్రం అగ్రభాగాన ఉండాలి అన్నదే ప్రభుత్వ ఆకాంక్ష” అని సీఎం పేర్కొన్నారు. యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి, వారి భవిష్యత్కు గ్యారెంటీ ఇచ్చే దిశగా ఆలోచన చేస్తున్నామని తెలిపారు. స్థంభించినపోయిన పాలనా వ్యవస్థలో సమూల ప్రక్షాళనకు సంకల్పించాంమనీ, జనం గోడు వినేందుకు ప్రజా భవన్లో ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. కార్యనిర్వాహక వ్యవస్థలో మానవీయత జోడించే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకుంటామనీ, దోపిడీకి గురైన తెలంగాణ ప్రజల సంపదను తిరిగి రాబడతామని తెలిపారు. ఫించన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల కోసంఎదురు చూసిన వారి ఆశలు త్వరతో ఫలిస్తాయని పేర్కొన్నారు. అమరులు, ఉద్యమకారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామనీ, వారిపై నమోదైన కేసులను ఎత్తి వేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఆటో కార్మికులు, అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం రూ.5 లక్షల బీమా సౌకర్యాన్ని తీసుకొచ్చామనీ, ఏండ్లుగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల సమస్యలకు త్వరలో పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ”నా తెలంగాణ కోటి రతనాల వీణగా… కోట్లాది ప్రజల సంక్షేమ వాణిగా… అభివద్ధిలో శిఖరాగ్రాన నిలవాలని…ప్రతి ఇంటా వెలుగులు నిండాలని” సీఎం ఆకాంక్షించారు.