కేఆర్‌ఎంబీ నిర్వహణకు నిధులిస్తాం

– పాత బకాయిలతోపాటు : కొత్త బడ్జెట్‌కూ కేటాయింపులు
– చైర్మెన్‌కు రాహుల్‌ బొజ్జా హామీ తెలంగాణ ఇస్తేనే మీమిస్తాం: ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి
– జలసౌధలో జరిగిన వర్చువల్‌ మీటింగ్‌లో అంగీకారం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
కష్ణా నది యాజమాన్యం బోర్డు(కేఆర్‌ఎంబీ) 2024-2025 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన నూతన బడ్జెట్‌ ప్రతిపాదనలను తెలుగు రాష్ట్రాలు ఆమోదించాయి. పాత పెండింగ్‌ బడ్జెట్‌తో పాటుగా నిర్వహణ కోసం మరో రూ. 25 కోట్లు అవసరమవుతాయని బోర్డు ప్రతిపాదించగా ఎట్టకేలకు తెలుగు రాష్ట్రాలు అంగీకరించాయి. అయితే తెలంగాణ బకాయిలు ఇచ్చిన అనంతరమే తాము వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ ఇచ్చేందుకు ఏపీ షరతు విధించింది. కేఆర్‌ఎంబీ చైర్మెన్‌ శివానందన్‌కుమార్‌ పర్యవేక్షణలో సోమవారం జలసౌధలో కెఆర్‌ఎంబీ సభ్యకార్యదర్శి డిఎం రాయిపురే వర్చుల్‌ మీటింగ్‌ ద్వారా ఏపీ నీటిపారుదల శాఖ ఈఎన్సీ నారాయణరెడ్డితో మాట్లాడారు. తెలంగాణ ఈఎన్సీ అనిల్‌ కుమార్‌ అధికారిక పర్యటనలో భాగంగా రాజస్థాన్‌లోని జైపూర్‌కు వెళ్లడంతో తొలుత ఈ మీటింగ్‌లో తెలంగాణ నుంచి అధికారులెవరూ పాల్గొనలేదు. అయితే చివరి నిమిషంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జా నేరుగా శివనందన్‌కుమార్‌తో మాట్లాడి పెండింగ్‌ బకాయిలు ఇచ్చేందుకు అంగీకరించారు. ఇక వివరాల్లోకి వెళితే కష్ణా నది యాజమాన్యం బోర్డు నిర్వహణకోసం రాష్ట్ర విభజన అనంతరం తెలుగు రాష్ట్రాలు నిధులు కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిధులతోనే తెలంగాణ, ఆంధ్ర మధ్య ఏర్పడిన జలవివాదాలను కేఆర్‌ఎంబీ పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నది. ప్రధానంగా నదీజలాల సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించడం, సమావేశాలు నిర్వహించడంతో పాటుగా కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనాలు సైతం చెల్లిస్తున్నది. ఇప్పటివరకు జరిగిన సమావేశాల్లో ఏపీ రూ. 11. 9 కోట్లు, తెలంగాణ రూ. 19.64 కోట్లు చెల్లించాల్సిన బడ్జెట్‌ లో తెలంగాణ రూ. 8. 64 కోట్ల మేర కేఆర్‌ఎంబీకి బకాయి ఉంది..ఈ నిధులను తెలంగాణ విడుదల చేస్తేనే ఏపీ నిధులు విడుదల చేస్తామని ఏపీ సాగునీటి శాఖ ఈఎన్నీ నారాయణరెడ్డి స్పష్టం చేయడంతో చివరి నిమిషంలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జా నేరుగా కేఆర్‌ఎంబీ చైర్మెన్‌ శివనందన్‌కుమార్‌తో మాట్లాడి పెండింగ్‌ నిధులతో పాటుగా వచ్చే బడ్జెట్‌ కూడా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇవ్వడంతో సమావేశానికి స్పష్టత వచ్చింది. అయితే పెండింగ్‌ సమస్యలను సత్వరంగా సత్వరం పరిష్కరించాలని రాహుల్‌ బొజ్జా కేఆర్‌ఎంబీకి విజ్ఞప్తి చేయగా శివనందన్‌కుమార్‌ సానుకూలంగా స్పందిం చినట్టు సమాచారం. త్వరలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి పెండింగ్‌ సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించనున్నట్టు శివనందన్‌కుమార్‌ హామ ఇచ్చినట్టు సమాచారం.