జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలిచ్చి తీరుతాం

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలిచ్చి తీరుతాం– డెక్కన్‌ జర్నలిస్ట్స్‌ హౌసింగ్‌ సొసైటీ ప్రతినిధులకు సీఎం రేవంత్‌రెడ్డి హామీ
– సచివాలయంలో సీఎంను కలిసిన డీజేహెచ్‌ఎస్‌ ప్రతినిధి బృందం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
హైదరాబాద్‌లోని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలిచ్చి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎంను డెక్కన్‌ జర్నలిస్ట్స్‌ హౌసింగ్‌ సొసైటీ (డీజేహెచ్‌ఎస్‌) అధ్యక్షులు బొల్లోజు రవి, కోశాధికారి చిలుకూరి అయ్యప్ప, డైరెక్టర్లు డి.రామకృష్ణ, స్వామిరెడ్డి, సభ్యులు క్రాంతి తదితరులు కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలపై సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితోనూ చర్చించాలని సూచించారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలన్న దానిపై ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా డీజేహెచ్‌ఎస్‌ అధ్యక్షులు బొల్లోజు రవి మాట్లాడుతూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన ఈ పదేండ్ల కాలంలో హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపు అంశం ఒక కలగానే మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ఇండ్ల స్థలాల అంశాన్ని చేర్చాలని ఎన్నికల సమయంలో అప్పటి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వినతిపత్రం ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. డీజేహెచ్‌ఎస్‌ విన్నపాన్ని మన్నించి మేనిఫెస్టోలో పొందుపర్చినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సొంతింటి కలను సాకారం చేసే విశాల హృదయం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఉందని విశ్వాసం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కేవలం తెలంగాణ ప్రాంత జర్నలిస్టులతో ఏర్పాటైన ఏకైక సొసైటీ ‘డెక్కన్‌ జర్నలిస్ట్స్‌ హౌసింగ్‌ సొసైటీ (డీజీహెచ్‌ఎస్‌)’ అని సీఎంకు విన్నవించారు. ఈ సొసైటీలో ఐదు వందల మందికి పైబడి సభ్యులున్నారన్నారు. వీరంతా వివిధ పత్రికలు, న్యూస్‌ ఛానెళ్లలో జిల్లా, రాష్ట్ర స్థాయిలో స్టాఫ్‌ రిపోర్టర్‌, సబ్‌ ఎడిటర్‌ నుంచి బ్యూరో చీఫ్‌లు, న్యూస్‌ ఎడిటర్‌, అసిస్టెంట్‌ ఎడిటర్‌ ఆపై స్థాయిలో హైదరాబాద్‌ కేంద్రంగా దశాబ్దాలుగా పనిచేస్తున్నారని సీఎంకు ఇచ్చిన వినతిపత్రంలో వివరించారు. డీజేహెచ్‌ఎస్‌లో వర్కింగ్‌ జర్నలిస్టులుగా పనిచేస్తున్న అందరికీ ఇండ్ల స్థలాలను కేటాయించాలని సీఎంకు విన్నవించారు.