– నిరంతర సాగు, తాగునీటి సరఫరాకు చర్యలు
– త్వరలో వార్ధా డీపీఆర్కు అనుమతి
– 26 నుంచి రైతుబంధు
– పోడు రైతులకూ వర్తింపు
– సీఏం కేసీఆర్ ఆదేశం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలంగాణ వ్యవసాయంతోపాటు రైతాంగాన్ని కాపాడుకోవడమే తమ ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు. వర్షాభావ పరిస్థితుల నేపధ్యంలో పంటల సాగుకు అంతరాయం లేకుండా సాగునీటి సరఫరా కోసం ముందస్తు చర్యలు తీసుకోవాలని సాగునీటిపారుదల, ఆయకట్టు శాఖను సీఎం ఆదేశించారు. అందుకోసం ఎంత ఖర్చయినా పర్వాలేదని స్పష్టం చేశారు. ”పైసలు పోయినా ఫర్వాలేదు పంటలు కాపాడాలని’ ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.. రుతుపవనాలు ఆలస్యమవుతున్న నేపథ్యం లో రాష్ట్ర రైతాంగానికి వానాకాలం పంట సాగునీటి సర ఫరాకు ముందస్తు చర్యల కోసం మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఇరిగేషన్ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి డా. బి. ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. పాలమూరు-రంగారెడ్డి పనుల పురోగతిని సైతం సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయా అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.
రైతుబంధు నిధుల విడుదల 26 నుంచి రైతుబంధు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని రైతాంగానికి ప్రభుత్వం శుభవార్త అందించింది. వానాకాలం పంట పెట్టుబడి రైతుబంధు నిధులను ఈనెల 26 నుంచి విడుదల చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు నిర్ణయించారు. రాష్ట్ర రైతాంగానికి ఎప్పటిలాగే నేరుగా వారి వారి బ్యాంక్ ఖాతాల్లో నగదును జమ చేయాలనీ అందుకు చర్యలు తీసుకోవాలంటూ ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును సోమవారం సీఎం ఆదేశించారు. కాగా… పోడు భూములకు పట్టాలు పంపిణీ చేసిన అనంతరం, వాటిని పొందిన రైతులకూ రైతు బంధు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు.
వానకాలం పంట పెట్టుబడి రైతుబంధు నిధులను జూన్ 26 నుంచి విడుదల చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. రైతు బంధు నిధులను రాష్ట్ర రైతాంగానికి ఎప్పటిలాగే నేరుగా వారి వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలనీ, అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆర్థిక శాఖామంత్రి టి. హరీష్రావు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణరావును సీఎం ఆదేశించారు.
పోడు రైతులకూ ‘రైతు బంధు’
పోడు రైతులకూ అందేలా చర్యలు తీసుకోండి : అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం
ఈ నెల 24 నుంచి గిరిజనులకు పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయనున్న నేపథ్యంలో పట్టాల పంపిణీ పూర్తికాగానే, ఆ రైతులకూ రైతుబంధు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
నిరంతర తాగునీటికి ముందస్తు చర్యలు
వాతావరణ శాఖ అంచనాల మేరకు జూలై మొదటి వారం దాకా వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉంటాయన్న హెచ్చరికల నేపథ్యంలో తాగునీటి కోసం ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు సూచించారు. ఈ వర్షాభావ పరిస్థితుల రోజుల్లో సాగునీటి కోసం నీటిని విడుదలకు కొద్ది రోజుల పాటు విరామం ఇవ్వాలని ఇరిగేషన్ అధికారులను సీఎం చెప్పారు.
రిజర్వాయర్లను నింపాలి
జలాశయాల్లో ప్రస్తుత నీటి నిల్వలను, మిషన్ భగీరథ అవసరాలను సంబంధిత అధికారుల నుండి సీఎం ఆరా తీశారు. జూలై మొదటి వారంలో వర్షపాతం, రిజర్వాయర్ల లో నీటి నిల్వలు తదితర అంశాలను సమీక్షించుకొని, పరిస్థితులకు అనుగుణంగా సముచిత నిర్ణయాలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కాళేశ్వరం పరిధిలోని రిజర్వాయర్లలో నీటి నిల్వ వివరాలను అడిగి తెలుసు కున్నారు. ప్రస్తుతం రంగనాయక సాగర్ జలాశయంలో మూడు టీఎంసీలకు గాను 0.69 టిఎంసిల నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయని ఇంజనీర్లు చెప్పగా, రంగనాయక సాగర్కు రెండు టీఎంసీల నీటిని మిడ్ మానేరు జలాశయం నుంచి తక్షణమే ఎత్తిపోయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీచేశారు. తద్వారా రంగనాయకసాగర్ జలా శయం కింద ఆయకట్టుకు వానాకాలం పంటకు నీరందిం చడానికి వీలవుతుందని గుర్తు చేశారు. ప్రస్తుతం నిజాం సాగర్ జలాశయంలో ఉన్న 4.95 టీఎంసీల నీటి నిల్వలు ఆగష్టు చివరి వరకు మూడు తడులకు సరిపోతాయనీ, ఆ తర్వాత మరో మూడు తడులకు ఐదు టీఎంసీలు అవసరమని ఇంజినీర్లు, సీఎంకు సూచించారు. దీని కోసం ఆగస్టులో ఐదు టీఎంసీలను కొండపోచమ్మసాగర్ ద్వారా నిజాంసాగర్కు తరలించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు నెలలోనే శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలను సమీక్షించి, కొరత ఏర్పడిన పక్షంలో శ్రీరాంసాగర్ పునరుజ్జీవన పథకం ద్వారా 30 నుంచి 35 టీఎంసీల నీళ్ళను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోయాలని నిర్ణయించారు. ఈ సంవత్సరం మల్లన్నసాగర్లో మరో 10 టీఎంసీలు నింపాలని నిర్ణయించారు. వానాకాలం ముగిసి జలాశయాల్లోకి ఇన్ఫ్లో ఆగిపోయిన తర్వాత అక్టోబర్, నవంబర్ నెలల్లో కాళేశ్వరం వద్ద గణనీయంగా గోదావరి నదుల్లో ప్రవాహాలుంటాయి. రెండో పంట అవసరాల కోసం ఆ నీటిని ఎత్తిపోసి ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్, మిడ్మానేరు, లోయర్మానేరు, అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ జలాశయాల్లో తగినంత స్థాయిలో నింపి పెట్టుకోవాలని సమావేశంలో నిర్ణయిం చారు. దీని కోసం ఎన్ని పంపులు, ఏ సమయంలో ఆన్ చేయాలనే విషయంపై ఒక ఆపరేషన్ మాన్యువల్ తయారు చేయాలని సాగునీటి అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సంవత్సరం ఏర్పడిన వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవ డానికి సాగునీటి శాఖ సన్నద్ధంగా వుండాలని ముఖ్యమంత్రి సూచించారు.
పాలమూరు రంగారెడ్డి పురోగతి పై సమీక్ష
పాలమూరు రంగారెడ్డి పనులను సీఎం కేసీఆర్ సమీక్షించారు. సుప్రీంకోర్టు తీర్పుకి లోబడి ఆగస్టు చివరి నాటికి తాగునీటి కోసం నార్లాపూర్, ఏదుల, కరివెన, ఉద్దండాపూర్ జలాశయాలలోకి నీటిని ఎత్తిపోయాలనీ, అందుకు అవసరమైన అన్ని పనులనూ త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. పనుల్లో జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లను తొలగించి, ఆయా పనులను సమర్థులైన కాంట్రాక్టర్లకు అప్పగించాలని సూచించారు. అలాగే తాగునీటి అవసరాలకు నీటిని మిడ్ మానేరు నుంచి గౌరవెల్లి జలాశయంలో కూడా ఎత్తిపోయాలని సీఎం సూచించారు. గౌరవెల్లి ఆయకట్టుకు సాగునీటి సరఫరా కోసం కాల్వల నిర్మాణానికై చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
వార్థా డీపీఆర్
వార్ధా బ్యారేజీ ప్రాజెక్టు పరిపాలన అనుమతి కోసం రూ. 4252.53 కోట్లకు ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపించామని ఈఏన్సీ సి.మురళీధర్ తెలిపారు. కేంద్ర జలసంఘంలో వార్ధా బ్యారేజి ప్రాజెక్టు డీపీఆర్ పరిశీలన ప్రారంభమైనందున, త్వరలో ప్రాజెక్టుకు పరిపాలన అనుమతి మంజూరు చేయాలని సీఎంను ఈఏన్సీ కోరారు. ప్రాజెక్టుకు పరిపాలన అనుమతి ప్రక్రియను పూర్తి చేసి ప్రభుత్వ ఆమోదం కోసం పంపాలని సంబంధిత అధికారు లకు ఈ సందర్భంగా సీఎం సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు టి. హరీష్రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, సీఎస్ శాంతికుమారి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్శర్మ, సీఎం ముఖ్య సలహాదారు సోమేష్కుమార్, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.రామ కష్ణారావు, సీఎం సెక్రటరీలు స్మితా సభర్వాల్, భూపాల్ రెడ్డి, సీఎం ఓఎస్డీలు శ్రీధర్రావు దేశ్పాండే, ఎత్తిపోతల సలహా దారు పెంటారెడ్డి, ఈఎన్సీలు మురళీధర్, ఎన్.వెంకటేశ్వర్లు, శంకర్, చీఫ్ ఇంజినీర్లు హమీద్ ఖాన్, రమణారెడ్డి, శ్రీనివాస్, అజరుకుమార్ తదితరులు పాల్గొన్నారు.