– ఫాక్స్కాన్ ప్రతినిధి బృందంతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణా సచివాలయంలో సీఎంతో ఫాక్స్కాన్కు చెందిన హాన్ హారు ప్రెసిషన్ ఇండిస్టీస్ ప్రతినిధి వీ లీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం భేటీ అయింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీఎస్. శాంతి కుమారి ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ప్రజల ఆకాంక్షలను కాపాడే భాద్యత కొత్తగా ఏర్పడిన తమ ప్రభుత్వంపై ఉందని తెలిపారు. అన్ని వర్గాలకు స్నేహపూర్వకంగా ఉండే పారిశ్రామిక విధానాన్ని అవలంబిస్తున్నామని చెప్పారు. పారిశ్రామిక వేత్తలకు పూర్తి సహాయ, సహకారాలందిస్తామన్నారు. పరిశ్రమల అభివృద్ధి, ఏర్పాటుకు కావాల్సిన అనుమతులను సులభంగా అందించటంతోపాటు, మౌలిక సదుపాయాలను కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా దేశంలోనే అగ్రగామిగా ఉంచేందుకు కావాల్సిన అన్ని చర్యలను తీసుకుంటామని తెలిపారు. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామనీ, కొంగర కలాన్ ఉత్పాదక కేంద్రం నిర్వహణకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని వివరించారు. ఫాక్స్కాన్ సంస్థ చేపట్టబోయే భవిష్యత్ ప్రాజెక్టులకు కూడా అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందిస్తామని పేర్కొన్నారు.
ఆపిల్ ఐఫోన్ల తయారీలో ..
ఫాక్స్కాన్ సంస్థ అపిల్ ఐఫోన్లను ప్రధానంగా తయారు చేస్తుంది. మార్చి 2023లో రాష్ట్ర ప్రభుత్వంతో ఆ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. చైనా,వియత్నాం, థారులాండ్, మలేషియా, అమెరికా, యూరప్, భారత్ సహా 24 దేశాల్లో ఆ సంస్థ కార్యకలాపాలు సాగిస్తున్నది.రాష్ట్రంలో కొంగరక లాన్ సమీపంలో సంస్థ తన ప్రాజెక్టును స్థాపించింది. ఎలక్ట్రానిక్స్ తయారు చేసే వ్యవస్థలను ఏర్పాటు చేయడం ద్వారా లక్ష ఉద్యోగాలను కల్పిస్తామనే హామీతో రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం(ఎంఓయు) పై సంతకం చేసింది.మొదటి దశలో భాగంగా వచ్చే రెండేండ్ల్లలో 25వేలఉద్యోగాలు కల్పించనున్నారు.