
నవ తెలంగాణ – సిద్దిపేట:
జిల్లాలో సైక్లింగ్ క్రీడ అభివృద్ధికి మంత్రి హరీశ్ రావు సహకారంతో చేస్తామని, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు పాల్గొనే విధంగా శిక్షణ ఇస్తామని సిద్దిపేట జిల్లా సైక్లింగ్ సంఘం అధ్యక్షులు బండారుపల్లి శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి జంగపల్లి వెంకట నరసయ్యలు తెలిపారు. తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ కు హైదరాబాదులోని నాగారం లో నూతన కార్యవర్గ ఎన్నికలు జరగగా సిద్దిపేట జిల్లా సైక్లింగ్ సంఘం అధ్యక్షులు బండారుపల్లి శ్రీనివాసులు రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షులుగా , జిల్లా ప్రధాన కార్యదర్శి జంగపల్లి వెంకట నరసయ్య కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం వారు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా సిద్దిపేట జిల్లాలో సైకిల్ క్రీడాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నామని అన్నారు. ప్రత్యేకించి ఆర్థిక మంత్రి హరీశ్ రావు చొరవతో ఖేలో ఇండియా సైక్లింగ్ సెంటర్ మంజూరు కావడంతో పాటు, పలు రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. పలువురు క్రీడాకారులు జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారని, సైక్లింగ్ క్రీడాభివృద్ధికి పాటుపడుతున్న సేవలను చూసి రాష్ట్ర సైక్లింగ్ సంఘంలో వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర కార్యవర్గంలో చోటు కల్పించడం జరిగిందని తెలిపారు. వీరు ఎన్నిక పట్ల రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, సిద్దిపేట జిల్లా క్రీడలు యువజన అధికారి నాగేందర్, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు పాల సాయిరాం, వివిధ క్రీడా సంఘాల బాధ్యులు, వ్యాయామ విద్య ఉపాధ్యాయలు అశోక్, సుజాత, మన్ మోహన్ ,అశోక్, ప్రవీణ్, రవీందర్ రెడ్డి, హర్షం వ్యక్తం చేస్తూ, ఎన్నికైన శ్రీనివాసులు, వెంకట నరసయ్యలను అభినందించారు.