నవతెలంగాణ – ముధోల్
బాసర పోలీసులు గోదావరి నది వద్ద ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చిన ఎందరినో గుర్తించి వారి ప్రాణాలను కాపాడటంతో పోలీస్ శాఖ ఉన్నతాదికారులతో పాటు, ప్రజలు, భక్తుల నుండి ప్రశంసలు పొందుతు పోలీసులు శభాష్ అనిపించుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే… నిర్మల్ జిల్లా ఎస్పీ జానకిషర్మిల ఆదేశాల మేరకు ఆత్మహత్యల నివారణ కోసం బాసర బ్రిడ్జి పై 24/7 పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. దీంతో తాజాగా శనివారం నిజామాబాదు జిల్లా కేంద్రానికి చెందిన ఆటోడ్రైవర్ విట్టల్ సంతోష్ అనే వ్యక్తి కుటుంబ కలహాల కారణంగా జీవితంపై విరక్తి చెంది తన ఆటోలోనే బాసర బ్రిడ్జి కి చేరుకున్నాడు.స్నాన ఘట్టాల వద్ద ఆటో లోనే కూర్చుని సూసైడ్ నోట్ రాసుకుంటుండగా, గమనించిన బ్లూకోట్ పోలీసు సిబ్బంది ప్రమోద్ , గగన్ లు సూసైడ్ నోట్ ని స్వాధీన పరుచుకొని, బాసర ఎస్సై గణేష్ కు సమాచారం అందించారు.దీంతో పోలీసులు బాధితుడి కి కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం బాధితుడు విఠల్ సంతోష్ ను కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిండు ప్రాణం ను కాపాడిన బాసర ఎస్సై గణేష్ తో పాటు,బ్లూకోట్ పోలీసు సిబ్బంది ప్రమోద్ , గగన్ లను ఎస్పీ జానకి షర్మిల, ఏ ఎస్పీ అవినాష్ కుమార్ , ముధోల్ సిఐ మల్లేష్ లు అభినందించారు.