బీహార్‌కు ప్రత్యేక హోదా కోసం నితీశ్‌ ఏం చేస్తున్నారు?

– కాంగ్రెస్‌ నిలదీత
న్యూఢిల్లీ: బీహార్‌కు ప్రత్యేక హోదా డిమాండ్‌ సాధన కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి, జేడీ(యూ) నాయకులు నితీశ్‌కుమార్‌ ఏమి చేస్తున్నారని కాంగ్రెస్‌ సోమవారం ప్రశ్నించింది. ప్రస్తుతం బీహార్‌కు ప్రత్యేక హోదా తీసుకోరాగల స్థితిలో ఉన్న నితీష్‌కుమార్‌ దీని కోసం మరింత ఒత్తిడి తేవాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. ఇటీవల విడుదల చేసిన నిటి ఆయోగ్‌ సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌ (ఎన్‌డీజీ) ఇండియా ఇండెక్స్‌ 2023-24 తరువాత బీహార్‌ ముఖ్యమంత్రులు రాష్ట్రానికి ఆర్థిక సాయం డిమాండ్‌ను సమర్థించడాన్ని కాంగ్రెస్‌ తప్పుపట్టింది. ఇటీవల నిటి ఆయోగ్‌ నివేదిక విడుదల తరువాత నుంచి బీహార్‌కు ప్రత్యేక కేటగిరి హోదా కేంద్రం నుంచి ఆర్థిక సాయంను రాష్ట్ర మంత్రులు డిమాండ్‌ చేస్తున్నారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్‌) జైరాం రమేష్‌ విమర్శించారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన పోస్టు చేశారు. ఇలాంటి డిమాండ్‌తో ఒక ఆర్థిక రుణంలో కేంద్రం చేసే సహాయం 70 శాతం నుంచి 10 శాతానికి తగ్గుతుందని వివరించారు. ‘పార్టీ సమావేశాల్లో తీర్మానాలు చేయడం, పత్రికా ప్రకటనలు ఇవ్వడం తప్ప బీహార్‌కు ప్రత్యేక హోదా కోసం నితీశ్‌ కుమార్‌ ఏమి చేస్తున్నారు. ఏమీ చేయకుండా దీనిపై కేవలం ఆయన మాట్లాడుతూ.. మాట్లాడుతూ.. మాట్లాడుతూ.. ఉన్నారు’ అని జైరాం రమేష్‌ విమర్శించారు. ‘ప్రస్తుతం బీహార్‌కు ప్రత్యేక హోదా తీసుకోరాగల స్థితిలో ఉన్న నితీష్‌కుమార్‌ దీని కోసం మరింత ఒత్తిడి తేవాలి’ అని జైరాం రమేష్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కూడా ఇదే వర్తిస్తుందని జైరాం రమేష్‌ పేర్కొన్నారు.