– ఖమ్మంలో జనరల్ స్థానాలన్నింటికీ బలమైన నేతలు
– ‘కారు’ దిగిన నేతలతో కాంగ్రెస్లో ఫుల్ జోష్
– ఎవర్ని ఎక్కడ సర్దుబాటు చేయాలో తెలియక సతమతం
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కొక్కరిగా కారు దిగుతున్న నేతలతో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం పెరగడంతో పాటు, కొత్త తలనొప్పులూ వచ్చి పడుతున్నాయి. ముఖ్యంగా జనరల్ స్థానాలు పాలేరు, ఖమ్మం, కొత్తగూడెం విషయంలో తీవ్ర పోటీ నెలకొంది. ఎవర్ని ఎక్కడ సర్దుబాటు చేయాలో తెలియని స్థితిలో కాంగ్రెస్ అధిష్టానం దీర్ఘాలోచనలో పడింది. కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తాజాగా కారు దిగేందుకు సిద్ధమైన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రేపోమాపో చేయందుకోవాలని భావిస్తున్న జలగం వెంకట్రావు, ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో టచ్లో ఉన్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత షర్మిల… ఇలా అందరూ ఉమ్మడి జిల్లాలో ఉన్న మూడు అన్ రిజర్వుడు అసెంబ్లీ స్థానాల కోసం పోటీ పడుతున్నారు. వీరిలో ఎవరిని ఎక్కడి నుంచి బరిలో దింపాలనే విషయమై కాంగ్రెస్ పార్టీలో సందిగ్ధత నెలకొంది.
పాలేరు సీటు యమా హాటు గురూ..!
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాంగ్రెస్ బాగా బలంగా ఉన్న నియోజకవర్గాల్లో పాలేరు ముందంజలో ఉంటుంది. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్లో చేరబోతున్న షర్మిల, తుమ్మల నాగేశ్వరరావు ఆసక్తి చూపుతున్నారు. కొత్తగూడెం నుంచి పోటీ చేస్తారని భావిస్తున్న పొంగులేటి శ్రీనివాస రెడ్డి సైతం పాలేరు సీటుకే మొదటి ప్రాధాన్యత అన్నట్టుగా ఉన్నారు. ఖమ్మం లేదా పాలేరు నుంచి పోటీ చేయాలని పొంగులేటి అనుచరుల ప్రధాన డిమాండ్గా ఉంది. ‘పోయిన చోటే వెతుక్కోవాలనే’ కోణంలో తుమ్మల నాగేశ్వరరావు గత ఎన్నికల్లో ఓడిన పాలేరు నుంచే గెలిచి తన సత్తా ఏంటో చూపించుకోవాలని భావిస్తున్నారు. కాంగ్రెస్లో చేరే విషయంలో ఆయన మొదటి కండిషన్ కూడా ఇదే అన్నట్టుగా తెలుస్తోంది. ఇక షర్మిల సైతం ‘మట్టి పట్టుకొని పాలేరు నుంచి పోటీ చేస్తానని’ ప్రమాణం చేసి ఉన్నారు. కాబట్టి ఆమె కూడా చేరాలన్నా.. పాలేరు సీటునే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కొత్తగూడెం నుంచి జలగం వెంకట్రావు పోటీకొస్తే పాలేరు నుంచి బరిలో నిలవాలన్న యోచనలో పొంగులేటి ఉన్నారు. కాగా, ఇప్పటికే ఈ స్థానం నుంచి పోటీ చేయాలని పాత కాంగ్రెస్ నేతలు రాయల నాగేశ్వరరావు, మాజీ మంత్రి రామ్ రెడ్డి వెంకట్ రెడ్డి తమ్ముని కుమారుడు చరణ్ రెడ్డి, మద్ది శ్రీనివాసరెడ్డి, బెల్లం శ్రీనివాస్, రామసహాయం మాధవీ రెడ్డి వంటి నేతలు కొంతమేరకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకొని ఉన్నారు. ఈ పరిణామాలతో వీరందరికీ మొండిచేయి ఎదురయ్యే పరిస్థితి కనబడుతోంది. ఇదిలా ఉండగా పొంగులేటి సోదరుడు ప్రసాదరెడ్డి సైతం పాలేరు పైనే కన్నేసినట్టు వార్తలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో పాలేరు కాంగ్రెస్ టికెట్ ఎవరికి దక్కుతుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఖమ్మం నుంచి తుమ్మల లేదంటే పొంగులేటి..?
ఖమ్మం నియోజకవర్గం కాంగ్రెస్ నుంచి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితేనే మంత్రి పువ్వాడ అజరు కుమార్కు దీటైన పోటీ ఇస్తారని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సామాజిక సమీకరణాల దృష్ట్యా తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నుంచి పోటీ చేస్తే ఉత్తమమని, పాలేరు బీఆర్ఎస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి కాబట్టి ఆ స్థానం నుంచి పొంగులేటి శ్రీనివాస రెడ్డి లేదా షర్మిల అయితే మెరుగైన ఫలితం వస్తుందనే అభిప్రాయం కాంగ్రెస్ శ్రేణుల నుంచి వినిపిస్తోంది. ఇక ఖమ్మం నియోజకవర్గానికి తుమ్మల, పొంగులేటి పేర్ల పరిశీలనతో ఇప్పటికే పార్టీని నమ్ముకొని ఉన్న పాత కాంగ్రెస్ నేతలు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ మానుకొండ రాధాకిషోర్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావీద్కు నిరాశ ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
కొత్తగూడెం నుంచి పొంగులేటా? జలగమా??
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్ర నియోజకవర్గం కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే సర్వం సిద్ధం చేసుకున్నారు. రూ.కోటికి పైగా వెచ్చించి ఇంటిని సైతం నిర్మించుకొని గృహప్రవేశమూ చేశారు. అక్కడి కాంగ్రెస్ శ్రేణులు, తన అనుచరులను ప్రచార నిమిత్తం సమాయత్తం చేశారు. రేపు మాపో ‘గడపగడపకు శీనన్న’ కార్యక్రమాన్ని చేపట్టేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన కాంగ్రెస్లో చేరితే ఉన్న మూడు జనరల్ స్థానాల్లో కన్నా కొత్తగూడెం బెటర్ ఆప్షన్ అని కాంగ్రెస్ శ్రేణుల నుంచి వినిపిస్తున్న మాట. ఈ స్థానానికి పొంగులేటే సరైన అభ్యర్థి అయినా వెంకట్రావుకు చోటు కల్పించేందుకు ప్రత్యామ్యాయం లేదు కాబట్టి శ్రీనివాసరెడ్డిని పాలేరు లేదా ఖమ్మం నుంచి బరిలో నిలపవచ్చని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. వీరిద్దరిలో ఎవరైనా పాత కాంగ్రెస్ నేతలకు ఇక్కడ కూడా చేదు అనుభవం తప్పట్లేదు. ఈ స్థానం నుంచి మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, టీపీసీసీ కార్యదర్శి ఎడవల్లి కృష్ణ పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే వీరిద్దరూ కొంత గ్రౌండ్ వర్క్ కూడా చేశారు. అయినా నైరాశ్యం తప్పేటట్టు లేదు. మొత్తం మీద ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని జనరల్ స్థానాల కూర్పు కాంగ్రెస్కు సవాల్గా మారనుంది.