– అందిన తొలి పరిశోధన
– ఇస్రో ప్రకటన
బెంగళూరు: చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా అడుగుపెట్టిన చంద్రయాన్-3 తొలి శాస్త్రీయ పరిశోధన వివరాలను పంపింది. ఈ వివరాలను ఇస్రో ఆదివారం వెల్లడించింది. చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్లోని ‘చంద్రాస్ సర్ఫేస్ థర్మో ఫిజికల్ ఎక్స్పరిమెంట్ (చస్తే)’ పేలోడ్ చంద్రుడి ఉపరితలంపై, కాస్త లోతులో సేకరించిన ఉష్ణోగ్రతల గణాంకాలను గ్రాఫ్ రూపంలో ఇస్రో వెల్లడించింది.’చాస్టే పేలోడ్.. చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద నేల పైపొర ఉష్ణోగ్రతలను లెక్కిస్తుంది. దీని ద్వారా చంద్రుడి ఉపరితల థర్మల్ ధర్మాలను అర్థం చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది. చంద్రుడి నేలపై 10 సెంటిమీటర్ల లోతువరకు చొచ్చుకెళ్లి, ఉష్ణోగ్రతలను లెక్కించే సామర్థ్యం ఈ పేలోడ్కు ఉంది. దీనికి 10 సెన్సర్లు అమర్చి ఉన్నాయి’ అని ఇస్రో పేర్కొంది. చంద్రుడి ఉపరితలంపైన, కాస్త లోతులో నమోదైన ఉష్ణోగ్రత వైవిధ్యాలు సంబంధిత గ్రాఫ్లో కనిపిస్తున్నట్లు చెప్పింది. ఇస్రో విడుదల చేసిన గ్రాఫ్ ప్రకారం.. చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రత సుమారు 50 డిగ్రీలుగా ఉంది. అదే 80 మిల్లీమీటర్ల లోతులో దాదాపు -10 డిగ్రీలుగా చూపిస్తోంది. చంద్రుడి దక్షిణ ధ్రువంలో ఉష్ణోగ్రతలకు సంబంధించి ఇవి మొదటి వివరాలు అని ఇస్రో వెల్లడించింది.