– దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలు తప్పవు
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
సోషల్ మీడియాలో, వాట్సప్ గ్రూప్ అడ్మిన్లు దుష్ప్రచారాలపై బాధ్యతతో వ్యవహరించాలని డీఎస్పీ జీవన్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణంలోని గాంధీచౌక్ ప్రదేశంలో గత రాత్రి గొడవ జరిగినట్టుగా కొన్ని వాట్స్అప్ గ్రూపులలో గతంలో జరిగిన వీడియోలను ప్రస్తుతం జరిగినట్లు దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరిస్తున్నట్లు పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాల క్రిందట జరిగిన సంఘటన వీడియోలను ప్రస్తుతం వాట్సాప్ గ్రూపులలో సర్కులేట్ చేస్తున్న వారిపై, పోస్టులు చేసిన వారిపై, గ్రూపుల అడ్మిన్లు తొలగించకపోయిన జిల్లా పోలీస్ సోషల్ మీడియా యంత్రాంగం గమనిస్తూ చట్టపరమైన చర్యలను తీసుకుంటుందని పేర్కొన్నారు. వాట్సాప్ గ్రూపు అడ్మిన్లు అప్రమత్తతో వ్యవహరిస్తూ ఇలాంటి దుష్ప్రచారాలు ఇతరులకు ఫార్వర్డ్ చేయకుండా ఉండాలని ఒకవేళ గ్రూపులో వచ్చినట్లయితే వాటిని వెంటనే తీసివేయాలని పేర్కొన్నారు. కావాలని ఎవరైనా ప్రశాంత వాతావరణ చెడగొట్టాలని ప్రయత్నం చేసినచో, రెచ్చగొట్టేలా వ్యవహరించిన, ఇలాంటి వీడియోలని ఫార్వర్డ్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని పేర్కొన్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పండగలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేటట్లు బందోబస్తు ప్రక్రియను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.