విష్ణు మంచు నటిస్తూ, నిర్మిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్తో డా.మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్.. ఇలా అన్నీ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ను ప్రకటించారు. ‘కన్నప్ప’ టీమ్ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ అయ్యేలోపు ఈ పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకుంటామని విష్ణు మంచు చెప్పారు. ఈ క్రమంలో ఉజ్జయినీ మహాకాళేశ్వర్ దేవాలయంలో ఈ సినిమా రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 25న భారీ ఎత్తున అన్ని భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్లుగా పేర్కొన్నారు.
ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రాన్ని హాలీవుడ్ టెక్నీషియన్లతో అంతర్జాతీయ స్థాయిలో రూపొందించారు. న్యూజిలాండ్ అందాలను తెరపై ఆవిష్కరించి.. కన్నప్పతో గ్రాండ్ విజువల్ ట్రీట్ ఇచ్చేందుకు ప్లాన్ చేశారు. ప్రభాస్, అక్షరు కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్, మధుబాల, దేవరాజ్, ముఖేష్ రిషి, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా, బ్రహ్మానందం వంటి హేమాహేమీలు నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే అందరిలోనూ క్యూరియాసిటీ పెంచింది. రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్తో ఆ ఆసక్తి మరింత రెట్టింపు అయ్యిందని చిత్ర యూనిట్ తెలిపింది.