వరదల నష్ట నివారణలో జాప్యం ఎందుకు?

– పైడాకుల అశోక్ ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు
నవతెలంగాణ-గోవిందరావుపేట
ఆకస్మిక వరదల వల్ల ఎంతో నష్టం జరిగితే ఆ నష్టాన్ని నివారించడం పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తుందని ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పైడాకుల అశోక్ అన్నారు. మండలంలోని చల్వాయి గ్రామంలో వరదల వల్ల సర్వస్వం కోల్పోయిన బాధితులకు నిహారిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం నిత్యావసర  సరుకులను అశోక్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ గ్రామంలోని గొత్తి కోయ గూడెంకి అకాల వర్షాల వలన వరద ఉధృతికి ఇండ్లు కూలిపోయి సర్వస్వం కోల్పోయిన వరద బాధితులకు  వరదల వల్ల నష్టపోయి ఇండ్లు కూలిపోయిన బాధితులకు ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వరదల వలన ప్రాణాలు కోల్పోతుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఫాంహౌస్ యందు ఉంటు కనీసం పట్టించుకోకపోవడం సిగ్గు చేటు అని అన్నారు. అలాగే భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ వారు ముందుగా హెచ్చరించిన కూడా ముందస్తు చర్యలు చేపట్టకుండా ఇంత నష్టానికి పరోక్షముగా కారకులయ్యారు అని అన్నారు. ములుగు నియోజకవర్గంలో నేను స్వచ్ఛంద సేవ సంస్థల ద్వారా వరద బాధితులకు కనీస అవసరాలను తీరుస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్న అని, కానీ మీరు మాత్రం కనీసంగా వరదల గురించి మాట్లాడకుండా ఉండడం విడ్డూరంగా ఉందని, వరదల్లో చిక్కుకుని మృతి చెందిన కుటుంబాలకు వెంటనే 5లక్షల రూపాయలు, ఇండ్లు కోల్పోయి సర్వస్వం కోల్పోయిన వారికి డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించి, వంట సామాగ్రి కొరకు లక్ష రూపాయల సహాయం, నీట మునిగిన ఇండ్లకు లక్ష రూపాయల సహాయం అందించాలని, అలాగే వరదల వల్ల పొలాల్లో ఇసుక మేటలు పెట్టి పంటలు దెబ్బతిన్నాయని, ఎకరానికి 30,000/- రూపాయల తక్షణ సహాయం అందించాలని ప్రభుత్వ ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవిచందర్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్, అధికార ప్రతినిధి వంశీ కృష్ణ, ఎల్లావుల అశోక్, మట్టేవాడ తిరుపతి, ఎంపీటీసీ చాపల ఉమాదేవి – నరేందర్ రెడ్డి, వేల్పుగొండ ప్రకాష్, జక్కి ప్రభాకర్ తదితర నాయకులు పాల్గొన్నారు.