ఉత్తర భారతదేశంలోని ఖుషీనగర్ సమీపంలో సాధారణ శకానికి ముందు 483 లేదా 400 BCEలో బుద్ధుడు తన ఎనభయ్యవ యేట మహా పరినిర్వాణం చెందాడు. ప్రస్తుతం ఇది ఉత్తర ప్రదేశ్లోని గోరక్పూర్ జిల్లాలో ఉంది. అక్కడ ఆయన స్మృతి చిహ్నంగా పడుకుని ఉన్న బుద్ధ విగ్రహం ఏర్పాటు చేశారు. తర్వాత కాలంలో ఆ విగ్రహం స్పూర్తితోనే పాలకడలిలో విష్ణుమూర్తి పవళించి, ఉండడాన్ని రూపొందించుకున్నారు. ఒక్కొక్కటిగా ‘అవతారాల’న్నీ ఆ తర్వాతే వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా ఉన్న బుద్ధ విగ్రహాల్ని మార్చి మార్చి, హిందూ దేవుళ్లను చేసుకున్న విషయాలు తేట తెల్లమయ్యాయి. అయ్యప్ప అయినా, బాలాజీ అయినా, పండరినాథుడైనా – నాశనం చేసిన బుద్ధ విగ్రహాలే! బౌద్ధారామాల్ని మార్చి ఆలయాలు చేసుకున్న ఘన చరిత్ర దాచేస్తే దాగేది కాదు గదా? ఈ విషయాల్ని దేశ ప్రజలు గుర్తించారు. గుర్తుంచుకున్నారు. ప్రతి విషయాన్ని ఆ కోణంలో విశ్లేషిస్తున్నారు. సృష్టి జరిగినప్పుడే ఆ దేవ దేవుడు దిగి వచ్చి వేదాలు, పురాణాలు, పవిత్ర గ్రంథాలు అన్నీ మనిషికి ఇచ్చి వెళ్ళాడు – అనేది అబద్దమని తేలిపోయింది. బౌద్ధ సాహిత్యంలో హిందూ దేవీ దేవతల్ని దూషించడం లేదు. హిందువుల పవిత్ర గ్రంథం రామాయణంలో బుద్ధుణ్ణి దూషించడం ఉంది. అంటే హిందువుల రామాయణ రచనకు ముందే బుద్ధుడు ఈ నేల మీద పుట్టి, బుద్ధిజాన్ని ప్రచారం చేశాడనీ ఒప్పుకున్నట్టే కదా? కుట్రలు, దొంగతనాలు తప్పక బయటపడతాయి.
అసలు రాముడు ముందుగా బోధిసత్వుడైనప్పుడు, రామాయణంలో మళ్లీ బుద్ధుణ్ణి తిట్టాల్సిన అవసరమేమో చ్చిందీ? – అనేది ప్రశ్న! అయితే జవాబు సులభంగా దొరకదు, కొంచెం లోతుగా పరిశీలించాలి. కలుషితమై ఉన్న మెదళ్లను శుభ్రం చేసుకుని, కొత్తగా ఆలోచిస్తేనే విషయం బోధపడుతుంది! జంబూ ద్వీపమని పిలవబడ్డ ఈ భరతఖండంలో సమ్యక్ సభ్యత వర్థిల్లుతూ ఉండేది. తర్వాత క్రమంగా అది ఆసియా ఖండమంతా వ్యాపించింది. ఆ తర్వాత యూరప్, అమెరికాల దాకా పాకింది. బుద్ధుని జాతక కథల్ని ఆసియా దేశాలన్నీ స్వీకరిం చాయి. అనువాదాలతో వాటిని తమ స్వంతం చేసుకున్నాయి. వాటిలో దశరధ జాతక కథ ఒకటి. ఇది సుత్తపిటక లోని ఖుద్దక నికాయలో 461వ జాతక కథ. దీనిలో కథా నాయకుడు బోధిసత్వుడైన రాముడు. అన్ని కథల వలెనే ఈ కథ కూడా ఇతర బౌద్ధ దేశాలకు వెళ్లింది. మార్పులు చేర్పులతో అది ‘రామాయణం’గా మారింది. ఆయనం అంటే పథం – మార్గం అని అర్థం. బోధిసత్వుడైన రాముడి మార్గం లేదా పథం అని అర్థం చేసుకోవాలి. అందరికి అందరూ ఆ కథను వారికి ఇష్టమైన రీతిలో పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు చేసుకున్నారు.
ఉదాహరణకు ఇండోనేషియాలో యోగేశ్వర్ రచనగా ”రామాయణ్ క కావిన్”గా వెలువడింది. కంపూచియాలో ”రామకీర్తి”, థారుల్యాండ్లో ”రామ్ కీ యేన్”్ణ లావోస్లో ”రామ్ జాతక్” బర్మా (మయన్మార్)లో ”రామ్ వత్య్రు”, మలేషియాలో ”హీకాయణ్ సేరీ రామ్”, ఫిలిప్పిన్స్లో ”మహా లాదియా లావణ్”, టిబెట్లో ”రామ్కథ” చైనాలో ”దశరథ కథనమ్” ఇంకా ”అనామక్ జాతకమ్” మంగోలియా వారి ”రామ్ కథ”, జపాన్ వారి ”రామ్ కథ”, శ్రీలంక ”రామ్ కథ”, నేపాల్ వారి ”భామా భక్తకృత రామాయణ్”, ఇండోనేషియా, ఫిలిప్పెన్స్, మలేషియా దేశాలలో బుద్ధుణ్ణి ఇస్లామీకరణ చేసుకుంటే – భారతదేశంలో అదే బుద్ధుణ్ణి బ్రాహ్మణీకరించు కున్నారు. బోధిసత్వుడైన రాముడి కథ ఇస్లాం దేశాలలో ఎక్కువగా మార్పుకు లోను కాలేదు. కానీ, భారత దేశంలో మాత్రం రాముడి వ్యక్తిత్వమే పూర్తిగా మార్చేశారు. బోధిసత్వుడైన రాముణ్ణి హింసాత్మక రాముడిగా మార్చుకున్నారు. భారత దేశం నుండి ఇతర దేశాలకు వెళ్లిన బౌద్ధ జాతక కథలు ముఖ్యంగా రాముడి కథ – కొద్ది మార్పులకు మాత్రమే లోనయ్యింది. పైగా రాముడు ‘బోధిసత్వు’డన్న విషయాన్ని ఎవరూ మార్చలేదు. ఇప్పటికీ ప్రపంచ దేశాల్లోని రామాయణాల్లో రాముడు బోధిసత్వుడే! ఇక్కడ భారతదేశంలో మాత్రం రాముణ్ణి బ్రాహ్మణవాదిగా చూపించడానికి నానా తంటాలు పడ్డారు.
వాల్మీకి రాయాయణం ఆయోధ్యకాండ 108వ సర్గలో బుద్ధుణ్ణి దూషించడం కూడా జరిగింది, జాగ్రత్తగా గమనించండి.
యధాహి చోర: సతధాహి బుద్ద్
స్థథాగత నాస్తిక్ మంత్ర్ విద్వీ
ఎలాగయితే, దొంగకు దండన అవసరమవుతుందో, అదే విధంగా వేదాలను వ్యతిరేకించే బుద్ధుడు ఇంకా అతని అనుచరులు, బౌద్ధమతావలంభికులు దండనీయులవుతారు. బోధిసత్వుడి స్పూర్తితో సృష్టించుకున్న రాముడి వ్యక్తిత్వాన్ని మార్చి వేయడమే కాకుండా, బుద్ధుడు వేదాలను దేవుణ్ణీ నిరాకరించాడన్న నెపంతో, అక్కసు వెల్లబోస్తూ దూషించారు కూడా! అలాగే, ఇంకా చూడండి
తస్మాధ్వి య: శక్యతమ్: పూజానాఁ
సనాస్తికె నాభీ ముఖో బుద్ధస్యతూ 135||
తధాగత్ (నాస్తిక విశేషణం) ఇంకా నాస్తిక్ (చార్వాక్)లను కూడా ఇదే క్రమంలో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజాక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాజుద్వారా దొంగలకు ఎలాంటి శిక్షలు ఇప్పిస్తామో, నాస్తికులకు కూడా అలాంటి శిక్షలే ఇప్పించాలి. ఈ విషయంతో సంబంధం లేని నాస్తికుల పట్ల – పండితులైన బ్రాహ్మణులు ఎప్పుడూ నిర్లిప్తంగా ఉండకూడదు. వదిలేయకూడదు – అని బ్రాహ్మణవాదులకు ఈ శ్లోకంలో ఒక హెచ్చరిక ఉంది.
సృష్టించుకున్న రాముడి పాత్ర గొప్పతనం చాటుకోవడానికి – కొన్ని శతాబ్దాలకు ముందు వాస్తవంగా జీవించిన బుద్ధుణ్ణి దూషించడం ఎందుకూ? వాల్మికి రామాయణం అయోధ్యకాండలో తమ రాముణ్ణి పొగడుతూ పొగడుతూ మధ్యలో ఇలా బుద్ధుణ్ణి తిట్టడం కనిపిస్తుంది. ఒక నాటి సంస్కృతులన్నీ బుద్ధుని కాలం నాటి శ్రమన సంస్కృతితో ముడిపడి ఉన్నవే! ఆ విషయం బ్రాహ్మణార్యులు గ్రహించరు. కాలక్రమంలో నశించిపోయిన మానవ నాగరికతలు, సభ్యతలు, చిహ్నాలు పట్టించుకోరు. అవసరం లేకపోయినా ప్రతి విషయంలోనూ దూరి, తమ వైదిక సంస్కృతిని జొప్పిస్తుంటారు. అందువల్ల, ఈ మనువాదుల దాడి ఈనాటిది కాదు. దాన్ని తిప్పికొట్టాల్సిన తరుణం ఆసన్నమైంది! మన భారతదేశంలో హైందవ మత బోధకులు ప్రచారం చేసిన రామాయణాన్ని మనం బాగా జీర్ణించుకుని ఉన్నాం కాబట్టి, విషయం ఆ కోణంలోంచి చూడొద్దు. మనం మాట్లాడుతున్నది బౌద్ధ సాహిత్యంలోని దశరథ జాతక కథ గురించి బోధిసత్వుడైన రాముడి గురించి అంటే, బుద్ధుడి గురించే – ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. సజీవంగా తిరుగాడిన బుద్ధుణ్ణి స్పూర్తిగా తీసుకుని, విష్ణుమూర్తిని, అతడి అవతారాలను సృష్టించుకున్నారన్న విషయం ముందు అర్థం చేసుకోవాలి.
బుద్ధుడు జ్ఞాన సముపార్జన కోసం రాజ్యం, అంత:పురం, సుఖసంతోషాలు వదిలి అడవికి వెళ్లాడు. ఈ ప్రపంచానికి దు:ఖ విముక్తి కలిగించడానికి, దానికి మార్గం కనుక్కోవడానికి వెళ్లాడు. సృష్టించుకున్న రాముడు తండ్రి మాట మీద అడవికి వెళ్లాడు. ప్రపంచం గానీ, జనం గానీ ఆయన దృష్టిలో లేరు. ఒక ధ్యేయమేదీ లేదు. వాస్తవానికీ కల్పనకూ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. భార్యాబిడ్డల్ని సురక్షితంగా అంత:పురంలో ఉంచి బుద్దుడు సమస్య పరిష్కారం కోసం అడవికి వెళ్లాడు. తనతో పాటు భార్యను అడవుల్లో తిప్పి, తనే సమస్యల్లో పడ్డాడు-దేవుడైన రాముడు. పైగా, తాను సురక్షితంగా అంత:పురంలో ఉండి, భార్యను అడవికి పంపించాడు. అమానవీయ, అనైతిక ప్రవర్తనలకు చిలువను పలువలుగా వ్యాఖ్యానాలు చెప్పుకుని వైదిక మత ప్రభోదకులు తమ రామాయణం ఒక గొప్ప పవిత్ర గ్రంథమనే భ్రమ కల్పించారు. అందుకు మూలమైన బుద్ధుణ్ణి బుద్ధుడి, జీవితాన్ని దాచేశారు. ఈ దేశ మూలవాసుల్ని ఎలా దోచేశారో – అదే సూత్రం బౌద్ధ సాహిత్యానికి, బౌద్ధ విశ్వవిద్యాలయాలకూ వర్తింపజేశారు. హాయిగా సహజంగా జీవన విలువలతో ఉన్న ఒక మహా మానవుడి కథను మార్చి మార్చి దేవుడి కథగా తిరగరాసుకుని పాపం బ్రాహ్మణార్యులు తరించిపోయారు.
ఇరాన్ ప్రాంతం నుండి వలస వచ్చిన ఆర్యులు తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి తాము పవిత్రులమని, ఉన్నతులమని, బ్రాహ్మణార్యులమని ప్రకటించుకున్నారు. మనుస్మృతి, పురాణాలతో సహా అన్ని సంస్కృత గ్రంథాలూ రాసుకున్నారు. వాటితో దేశంలో వర్ణవ్యవస్థను సుస్థిరం చేశారు.వలస రావడం తప్పుకాదు.ఈ భూభాగం మీద స్థిర నివాసాలను ఏర్పరుచుకోవడం తప్పుకాదు. ఆఫ్రికాలో మొదలైన ఆది మానవ జాతులు ప్రపంచ వ్యాప్తంగా వలసలు వెళ్లాయని ఆధునిక జన్యుశాస్త్రం ధృవీకరించింది. మూలవాసులని ఎవరినైతే అంటున్నామో – వారు కూడా అంతకు ముందు ఆ మహా మానవ వలసల ఒరవడిలో తరలి వచ్చినవారే. అయితే, దుర్మార్గమేమంటే – తమను తాము స్థిర పరుచుకోవడానికి అంతకు ముందున్న సంస్కృతుల్ని, జీవన విధానాల్ని, నాగరికతల్ని, భాషల్ని ధ్వంసం చేయడం దుర్మార్గం! తమ అబద్దాలకు, కుట్రలకు, కుతంత్రాలకు పవిత్రను ఆపాదించడం, తమను తాము దైవాంశ సంభూతులమని ప్రచారం చేసుకోవడం దౌర్జన్యం!! ముందుగా వచ్చి, హాయిగా స్థిరపడి, వ్యవసాయం, పశుపోషణ అభివృద్ధి చేసుకుని, సాంకేతిక పరిజ్ఞానం సాధించిన సింధూ ప్రాంత ప్రజల్ని దోచుకుని, నాశనం చేసి వెళ్లగొట్టింది ఎవరూ? తర్వాత కాలంలో వలస వచ్చిన బ్రాహ్మణార్యులే కదా? ఈ దేశంలోని చార్వాక, బౌద్ధ, జైన, ఆలోచనా విధానాల్ని ధ్వంసం చేసి, తమదైన బ్రాహ్మణవాదాన్ని ప్రవేశపెట్టి, శతాబ్దాలుగా జనాన్ని హింసిస్తున్నదెవరూ? దేవుడు, దెయ్యం, జన్మ, పునర్జన్మ, శాంతి, పూజ, బలి వంటి మూఢనమ్మకాల్ని ప్రవేశపెట్టి, ప్రజల్ని మానసిక బానిసలుగా మార్చి పనిచేయకుండా సుఖపడు తున్నది ఎవరూ? శ్రమకూ, చెమటకూ విలువ లేకుండా చేసిందెవరూ? ప్రపంచంలో ఎక్కడా లేని సమస్యల్ని సృష్టించిన ఈ దోషుల్ని ఊరికే వదిలేస్తామా? వీరి అప్రకటిత అధికారాల్ని సాగనిస్తామా? వారి కుళ్లు ఆలోచనల్ని కుళ్లబొడవమా? ప్రపంచ పౌరులంతా సమానులే – అన్న విషయం చెప్పి, ఒప్పించి ఒక విలువైన మానవవాద ప్రపంచాన్ని తీర్చిదిద్దుకోవాలి! ఊరికే ఆలోచిస్తూ కూర్చోవడం కూడా కాదు, ఇక ఆ దిశలో తక్షణం కార్యోన్ముఖులు కావడం అవసరం! అవసరం కాదు, అత్యవసరం!!
– కేంద్ర సాహిత్య అకాడమీ విజేత, జీవశాస్త్రవేత్త (మెల్బోర్న్ నుంచి)
– డాక్టర్ దేవరాజు మహారాజు