ఒకప్పుడు టూ వీలర్ చేర్చుకోవడానకి ఆమె ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. అలాంటి ఇబ్బంది మరే మహిళకు ఎదురు కాకూడద నుకుంది. అందుకే మహిళల కోసం ప్రత్యేకంగా టూ వీలర్ కోచింగ్ సెంటర్ ప్రారంభించింది. ఇప్పటి వరకు మూడు వేల ఐదు వందల మందికి డ్రైవింగ్లో శిక్షణ ఇచ్చింది. తానూ ఓ పారిశ్రామిక వేత్తగా స్థిరపడింది ముంబయికి చెందిన అమృతమనే. ఆమె పరిచయం నేటి మానవిలో…
అమృత మానే తన స్వస్థలమైన ముంబయి లోని నిత్యం రద్దీగా వుండే వీధుల్లో, కార్ల హారన్ మోతల మధ్య తన గేర్ మోటార్ సైకిల్తో ముందుకు వెళ్లడానికి చాలా కష్ట పడుతోంది. నాన్ గేర్ బైక్ను నడిపే అను భవం వున్న ఆమె గేర్ మోటార్ సైకిల్ నడ పడం ఇదే మొదటిసారి. గేర్లపై ఆమెకు పెద్దగా అవగాహన లేదు. ‘అందుకే అమ్మాయిలు డ్రైవింగ్ చేయకూడదు’ అంటూ చుట్టూ ఉన్నవారు అరవడం మొదలుపెట్టినప్పుడు నేను మొదట భయపడ్డాను. కానీ ఒక అపరిచితుడు గేర్లను ఎలా మార్చాలో చెప్పిన తర్వాత, బైక్ను రీస్టార్ట్ చేయగలను, అది సాఫీగా సాగింది. ఇది నాకు సంతోషకరమైన అనుభవం. అప్పుడు నేను ఎంత స్వేచ్ఛగా భావించానో మాటల్లో చెప్పలేను’ అంటూ ఆమె పంచుకున్నారు. అప్పటి నుంచి అమృత వెనుదిరిగి చూసుకోలేదు.
చాలా ముందుకు వచ్చింది
తన పొరుగువారికి టూ వీలర్ డ్రైవింగ్ నేర్పించడం నుండి డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ని స్థాపించడం వరకు చాలా ముందుకు వచ్చింది. 2018లో ‘ఉమెన్ ఆన్ వీల్స్’ను ప్రారంభించింది. ‘నేను డ్రైవింగ్లో సరైన పాఠాలు నేర్చుకోవాలనుకున్నపుడు శిక్షణా కేంద్రాలు లేవు. పైగా మహిళా శిక్షకులు ఉన్న కేంద్రాలు చాలా తక్కువ ఉన్నాయి’ అని ఆమె గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం పూర్తిగా మహిళల కోసం, మహిళలతో నడుస్తున్న డ్రైవింగ్ స్కూల్ ముంబయిలో ఈమెది మాత్రమే. ఇప్పటి వరకు ఉమెన్ ఆన్ వీల్స్ 3,500 మంది మహిళలకు శిక్షణ ఇచ్చింది.
ప్రయాణాలు చేయాలనే కోరికతో…
అన్వేషణ పట్ల మక్కువతో సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలని కోరుకునే అమృత మోటారు సైకిళ్లు, కార్ల పట్ల అత్యంత ప్రేమ పెంచుకుంది. 8వ తరగతిలో ఉన్నప్పుడు బంధువు ఆమెకు గేర్తో కూడిన మోటార్సైకిల్ నడపడంలో ప్రాథమికాంశాలు నేర్పించాడు. ‘ఇది ఒక మంచి అనుభవం. మోటార్సైకిల్ను మరింత నైపుణ్యంగా నేర్చుకుని నడపాలని నాలో కొత్త కోరికను రేకెత్తించింది’ అని ఆమె ఉత్సాహంగా చెప్పారు. ఇంతలో అమృత తండ్రి తన తల్లికి హోండా యాక్టివాను కొనుగోలు చేశాడు. ఆమె ఉద్యోగానికి వెళ్లడానికి వాహనం అవసరం. అమృతకు మోటారు సైకిల్ గురించి ప్రాథమిక విషయాలు తెలుసు కాబట్టి డ్రైవింగ్ చేయడం, యాక్టివా నడపడం సరదాగా భావించానని ఆమె చెప్పారు. ఆమె లక్ష్యం మోటార్సైకిల్ నడపడం.
మంచి అనుభవం
తెలిసిన వారు ఒకరు తన గేర్ మోటార్ సైకిల్ను ఇచ్చి నడపమంటే తనకు అది నడపడం రాదని వెనక్కు ఇచ్చేశారు. దీనికి ఆమె బాధపడలేదు. ‘ఆ మోటార్సైకిల్ను ఎలా నడపాలో తెలియకుండా వీధుల్లోకి తీసుకెళ్లడం నా పొరపాటు. కానీ అది నిజంగా మంచి అనుభవంగా మారింది’ అని పంచుకున్నారు. దాంతో 2018లో తన ఎంబీఏ తరగతులు ప్రారంభం కావడానికి మూడు నెలల ముందు అమృత డ్రైవింగ్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. త్వరలోనే ఒక ద్విచక్ర వాహన డ్రైవింగ్ స్కూల్ను స్థాపించాలనే ఆలోచన చేశారు. దానికి ఆమె మొదట అమృత డ్రైవింగ్ స్కూల్ అని పేరు పెట్టారు. కొంత కాలం తర్వాత ఉమెన్ ఆన్ వీల్స్గా రీబ్రాండ్ చేశారు. దీని కోసం ఆమె పెద్దగా ప్రచారం చేయలేదు. రెండు నెలల్లోనే చాలా మందికి దీని గురించి తెలిసిపోయింది.
విద్యార్థుల అనుభవాలు
మునుపటి శిక్షణా కేంద్రంలో అసౌకర్యానికి గురైన ఒక విద్యార్థిని అమృత గుర్తుచేసుకున్నారు. సెషన్లో ఒక మగ శిక్షకుడు ఆమెకు ద్విచక్ర వాహనం నడపడం నేర్పుతున్నప్పుడు ఆమెపైకి వంగి అసౌకర్యానికి గురి చేశాడు. ఇక్కడ నేర్పించేది అమృత కాబట్టి ఆమెకు అలాంటి ఇబ్బంది కలగలేదు. హాయిగా డ్రైవింగ్ నేర్చుకోగలిగింది. నవీ ముంబైకి చెందిన 22 ఏండ్ల మార్కెటింగ్ ప్రొఫెషనల్ ఉజ్మా కూడా ఓ అనుభవం ఉంది. ఒక స్నేహితుడితో కలిసి యాక్టివ్ రైడ్ చేయడం నేర్చుకుంటూ ఎదురుగా వస్తున్న ట్రక్కు వల్ల ఆమె అదుపు తప్పి పడిపోయింది. ఈ సంఘటన తర్వాత ఆమె రెండేండ్ల పాటు ద్విచక్ర వాహనం నడపడం మానేసింది. ఇంటి నుండి ఆఫీస్కు వెళ్లడానికి రోజుకు రూ. 150 ఖర్చు చేస్తుంది. డబ్బు ఆదా చేయాలనే ఆసక్తితో ఆమె మళ్లీ డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంది. ‘మహిళా కోచ్లు ఉన్నందున నేను ఈ సెంటర్ (ఉమెన్ ఆన్ వీల్స్)లో చేరాను. శిక్షణ మొత్తం ఎంతో సౌకర్యవంతంగా భావించాను. అమృత కూడా నన్ను కొనసాగించడానికి, నా భయాన్ని పోగొట్టడానికి చాలా ప్రేరేపించింది’ అని ఆమె పంచుకుంది. ఇలాంటి వారు ఎందరో అమృతను ప్రేరేపించారు.
కరోనా ఇచ్చిన కొత్త ఆలోచన
కోవిడ్-19 మహమ్మారి అన్ని కార్యకలాపాలను నిలిపి వేసింది. డిసెంబరు 2019లో ఆఫీస్ని సెటప్ చేసిన మూడు నెలల తర్వాత అమృత తన కార్యాలయాన్ని మూసివేయవలసి వచ్చింది. ‘కరోనా వల్ల శిక్షణ పొందిన నా పాత ఉద్యోగులను కోల్పోతానేమో అనే ఆలోచన నన్ను భయపెట్టింది. అందుకే ఇలాంటి కష్టతరమైన పరిస్థితుల్లో కూడా నా పనిని కొనసాగించాలనుకున్నాను’ అని ఆమె జతచేశారు. కరోనా సమయంలో ఆన్లైన్ కొనుగోళ్ళు, హౌం డెలివరీలు బాగా పెరిగాయి. ఇది అమృతకు ఓ కొత్త ఆలోచనను ఇచ్చాయి. దాంతో వావ్ డెలివరీలను ప్రారంభించారు. తన శిక్షకులతో పాటు ఏడాదికి అవసరమైన మందులు, ఆహారం మొదలైన వాటిని పంపిణీ చేయడం ప్రారంభించారు. తన అనుభవాన్ని వివరిస్తూ మహమ్మారి సమయంలో పని చేయడం మానసికంగా సవాలుగా ఉండేదని గుర్తు చేసుకున్నారు.
వివిధ సెషన్లు
ఒక నెలలో 10 మంది విద్యార్థుల నుండి ప్రారంభించి అమృత ఇప్పుడు ఒక నెలలో దాదాపు 50 మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తుంది. నాన్-గేర్ బైక్లు, రాయల్ ఎన్ఫీల్డ్తో సహా డ్రైవింగ్ గేర్, నాన్-గేర్ ద్విచక్ర వాహనాలపై ఈ కేంద్రం మహిళలకు శిక్షణ ఇస్తుంది. నాన్-గేర్ బైక్ల కోసం ఇది 10 రోజుల సెషన్ను అందిస్తుంది. ఇక్కడ మొదటి నాలుగు రోజుల్లో బ్యాలెన్సింగ్, స్పీడ్ కంట్రోల్, టర్న్లు తీసుకోవడం, డబుల్ డ్రైవింగ్ నేర్పుతుంది. ప్రతి సెషన్కు 40 నిమిషాల నిడివి ఉంటుంది. సోమవారం నుండి శనివారం వరకు నిర్వహించబడుతుంది. హోండా సిటీ 100 బైక్ కోసం ఎనిమిది రోజుల పాటు 40 నిమిషాల సెషన్లను నిర్వహిస్తుంది. అయితే రాయల్ ఎన్ఫీల్డ్కి పది రోజుల పాటు గంట సెషన్లు పడుతుంది. నాన్-గేర్ బైక్లకు రూ. 3,750, గేర్ బైక్లకు రూ. 5,000 వసూలు చేస్తారు. ఉమెన్ ఆన్ వీల్స్ గ్రూప్ సెషన్లను కూడా నిర్వహిస్తుంది. ‘డ్రైవింగ్ నేర్చుకునేందుకు మా వద్దకు వచ్చే కొంతమంది విద్యా ర్థులు వారి కోర్సు తర్వాత కోచ్లుగా మారతారు’ అని ఆమె వివరిస్తూ కంపెనీలో మొత్తం 15 మంది మహిళా శిక్షకులు ఉన్నారని, వారు నెలలో రూ. 15,000 లేదా అంతకంటే ఎక్కువ సంపాదిస్తారని చెప్పారు.
స్త్రీలను స్వతంత్రులను చేయడం
అమృత తన శిక్షణా సేవలను పేద విద్యార్థులకు అందజేస్తుంది. వారు తమ ఫీజులు చెల్లించవచ్చు లేదంటే శిక్షకురాలిగా చేరవచ్చు. ఉమెన్ ఆన్ వీల్స్ వారి జీతం నుండి రుసుమును తీసివేస్తుంది. ఆమె తండ్రి శిక్షణా కేంద్రంలో ఆరు నాన్-గేర్, మూడు-గేర్ మోటార్సైకిళ్లను కొనుగోలు చేయడానికి డబ్బు పెట్టుబడిగా ఇచ్చారు. ఇప్పటివరకు ఉమెన్ ఆన్ వీల్స్ కార్యకలాపాలు ముంబయికి మాత్రమే పరిమితమయ్యాయి. అయితే అమృత తన వ్యాపారాన్ని పాన్-ఇండియాకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ‘స్త్రీలను స్వతంత్రులను చేయడం, మూస పద్ధతులను బద్దలు చేస్తూ మా సంస్థ ద్వారా వారికి ఉపాధి కల్పించడంలో సహాయపడటం నా లక్ష్యం” అని ఆమె ముగించారు.
పూల పాన్పు కాదు
2022లో పరిస్థితులు మెరుగుపడిన తర్వాత అమృత తన డ్రైవింగ్ స్కూల్ వ్యాపారానికి తిరిగి వచ్చేసింది. అయితే ఆమె ప్రయాణం పూల పాన్పు కాదు. మొదట్లో చాలా మంది నివాసితులు ప్రమాదాల గురించి భయపడి పోలీసులను ఆశ్రయించేవారు. అయినప్పటికీ ఆమె తన శిక్షణా సెషన్లను క్రమశిక్షణగా కొనసాగించారు. ‘శిక్షణను నిలిపివేయమని పోలీసులు నన్ను ఎన్నో సార్లు ఆదేశించారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నందున సహాయం కోరుతూ సందేశం రాశాను. స్థానిక కార్పొరేటర్లు, తెలిసిన వ్యక్తులు పై అధికారులతో మాట్లాడి నాకు సహాయం చేసారు’ అని ఆమె గుర్తుచేసుకున్నారు. అయినా సవాళ్లు ఆగలేదు. ఓ మహిళా ఎన్నో అవమానాలు ఎదుర్కో వలసి వచ్చింది. వీటన్నింటినీ ఆమె ధైర్యంగా ఎదుర్కొంది.