పరేడ్‌ గ్రౌండ్‌లో 12న మహిళా సదస్సు

– లక్ష మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులరాక : ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి : సీఎస్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 12 తేదీన సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో దాదాపు లక్ష మంది స్వయం సహాయక బృందాల మహిళలచే రాష్ట్ర మహిళా సదస్సును నిర్వహించనున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. మహిళా సదస్సు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో శుక్రవారం ఆమె టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పరేడ్‌ గ్రౌండ్‌లో చేసే ఏర్పాట్లు, పార్కింగ్‌, హాజరయ్యే మహిళలకు తగు ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సదస్సులో రాష్ట్ర ముఖ్య మంత్రి ఏ. రేవంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. ఈ కాన్ఫరెన్స్‌లో డీజీపీ రవిగుప్తా, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాసరెడ్డి, సమాచార శాఖ స్పెషల్‌ కమిషనర్‌ హనుమంతరావు తదితర అధికారులు పాల్గొన్నారు.